- నాగారం మున్సిపాలిటీ పరిధిలో యధేచ్చగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అక్రమార్కులు
- సర్వే నెం. 354లోని సర్కారు భూమి మాయం
- నాగారంలో గజం లక్షల్లో పలుకుతున్న భూమి ధర
- రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సపోర్ట్
- ఉన్నతాధికారులు దృష్టిసారించాలని స్థానికుల రిక్వెస్ట్
రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ జాగ కనబడితే అక్కడ కర్చీఫ్ వేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్ లను పూర్తిగా పొతం పెడుతున్నారు. కబ్జాకోరులకు ప్రభుత్వ అధికారులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. రూ. లక్షల్లో జీతాలు తీసుకునే అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి మాముళ్లు తీసుకుంటున్నారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లే కబ్జాల పర్వం కొనసాగుతున్నది. డబ్బు ఆశ చూపి అధికారులతో పని చేయించుకుంటున్నారు. భాగ్యనరంలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.
నాగారం మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములను యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. నాగారం రెవెన్యూ సర్వే నెం. 354లోని ప్రభుత్వ భూమి పూర్తిగా కబ్జాకి గురైంది. ఈ ప్రభుత్వ భూమిలో బాలాజీ మిఠాయి బండార్ భవనం ఉందని రెవెన్యూ అధికారులు నిర్ధారించినా కూడా యధేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పట్టించుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరించండం గమనార్హం. నాగారం ప్రధాన రహదారి వెంబడి గజం ధర లక్ష రూపాయలకు పైగా పలుకుతుండడంతో రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వ భూమిలో యధేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణం చేస్తుంటే, జీహెచ్ఎంసీ అధికారులు ముడుపులు తీసుకొని, అనుమతులు ఇవ్వడం శోచనీయం. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చొరవ చూపకపోవడం విడ్డూరం. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని, రెవెన్యూ అధికారులకు జీహెచ్ఎంసీ అధికారులు లేఖ రాయడం జరిగింది. అయినప్పటికి అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోకుండా, నిర్మాణదారుడితో లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. కాగా, రెవెన్యూ అధికారులు సర్వే నెం. 354 ప్రభుత్వ భూమి అని నిర్ధారించినప్పుడు సూచిక బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు.. జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు ప్రభుత్వ స్థలంలో నిర్మించి అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించలేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు..
నాగారంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాలకై వినియోగించాలని నాగారం మున్సిపల్ వాసులు కోరుకుంటున్నారు. ఇకనైన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కబ్జాకోరులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.