- 101కు చేరిన పుణేలో జీబీఎస్ సోకిన వారి సంఖ్య
- 16 మంది రోగుల పరిస్థితి విషమం
గుల్లెయిన్ బారే సిండ్రోమ్తో మహారాష్ట్రలో తొలి మరణం నమోదైనట్లుగా తెలుస్తున్నది. సోలాపూర్లో ఓ వ్యక్తి మరణించగా.. మరణానికి జీబీఎస్ కారణంగా మరణించినట్లుగా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో సిండ్రోమ్ బారినపడుతున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉన్నది. పుణేలోనే వంద మందికిపైగా రోగులున్నారు. మృతుడిని సోలాపూర్ నివాసిగా గుర్తించారు. సదరు వ్యక్తి కొద్దిరోజుల కిందట పుణేకు వచ్చాడని.. ఆ సమయంలోనే సిండ్రోమ్ సోకినట్లుగా భావిస్తున్నారు. ఇమ్యునోలాజికల్ నరాల వ్యాధి గుల్లెయిన్ బారే సిండ్రోమ్ వ్యాప్తి పుణేలో ఎక్కువగా కనిపిస్తున్నది. ఆదివారం నాటికి సంఖ్య వందకుపైగా దాటింది. పుణేలో జీబీఎస్ సోకిన వారి సంఖ్య 101కి పెరిగింది. ఇందులో 68 మంది పురుషులు, మరో 33 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 16 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన రాపిడ్ రెస్పాన్స్ టీం, ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ముఖ్యంగా పూణేలోని సింఘాడ్ రోడ్డులో గరిష్ఠ సంఖ్యలో రోగులను గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేకంగా నిఘా వేశారు. ఇప్పటివరకు, రాష్ట్రంలో 25,578 ఇళ్లను సర్వే చేశారు. ఇందులో 15,761 ఇండ్లు పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. మరో 3,719 నివాసాలు చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. 6,098 ఇండ్లు రూరల్ ప్రాంతానికి వస్తాయి. గుల్లెయిన్ బారే సిండ్రోమ్.. జీబీఎస్ అనేది రోగనిరోధక నాడీ వ్యాధి. వ్యాధి సోకితే చేతులు, కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరి వస్తాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. వ్యాధి లక్షణాల్లో బలహీనత.. విరేచనాలు ఉంటాయి. సాధారణంగా జీబీఎస్ సమస్య బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ రోగనిరోధక శక్తిని కూడా బలహీనంగా మారుస్తుంది. పిల్లలు, యువత ఎక్కువగా ఈ వ్యాధి బానిపడుతున్నారు. వ్యాధి బారినపడ్డ వారంతా కోలుకుంటుండడం విశేషం. తాగునీటిని శుభ్రంగా ఉంచుకోవాలని, మరిగించి చల్లార్చిన నీటినే తాగాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఆహారం సైతం శుభ్రంగా ఉంచుకోవాలని.. కూరగాయాలను శుభ్రంగా కడుక్కోవాలని.. బాగా ఉడికించి తినాలని వైద్యశాఖ అధికారులు సూచించారు.