- జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం కృషి చేయాలి
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య
- షాద్ నగర్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షులు మామిడి సోమయ్య అన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు మిద్దెల సత్య నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడుతూ, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలి స్టుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు ఫెడరేషన్ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా సిద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, హక్కులు హరింపబడుతున్నాయని, పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో కొనసాగిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని, జీవో 239 సమీక్ష పేరుతో కమిటీ వేసి కాలయాపన చేస్తుందని విమర్శించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ స్కీం, హెల్త్ కార్డులు, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ల సాధనకై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, కార్యదర్శి జగదీష్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు దేవేందర్, జిల్లా కార్యదర్శి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్ నరేష్ నరసింహారెడ్డి ఆంజనేయులు లక్ష్మణ్ భరత్ తదితరులు పాల్గొ న్నారు. జిల్లాలో ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మార్చి నెలాఖరు నాటికి ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, నియోజకవర్గ మహాసభలు పూర్తి చేసి ఏప్రిల్ మొదటివారంలో జిల్లా మహాసభలు జరపాలని సమావేశం తీర్మానించింది.