- 14 నెలలుగా కార్యదర్శుల జేబు నుండి ఖర్చు చేసి పనులు నెట్టుకొస్తున్న వైనం
- ఒక్కో గ్రామపంచాయతీకి 5 నుండి 10 లక్షల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వం..
- పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు
- వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో నిలిచిపోనున్న పంచాయతీ ట్రాక్టర్లు..!
గ్రామపంచాయతీల ఖాతాల్లో గత 14 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్లు ఎడాపెడా పనులు చేపట్టి అప్పుల్లో మునిగిపోయారు. దీంతో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా సర్పంచ్లను పంచాయతీరాజ్ కార్యాలయాల చుట్టూ ఇంకా తిప్పుకుంటునే ఉన్నారు. సర్పంచుల పదవి కాలం ముగిసిన నాటి నుండి గ్రామపంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. కాగా పంచాయతీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. మరమ్మత్తు పనులు కూడా ఎక్కడా జరగని పరిస్థితి ఏర్పడగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం గమనార్హం. కొన్నిచోట్ల మూడు నాలుగు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందడం లేదు. గ్రామ పంచాయితీ ట్రాక్టర్ డీజిల్ బిల్లు బకాయిలు ఒక్కొక్క గ్రామపంచాయతీలో సుమారు లక్ష వరకు ఉన్నాయి.
ఇకపోతే వికారాబాద్ జిల్లాలో 590 గ్రామ పంచాయతీలకు రూ. కోట్లలో బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు అధికారికంగా తెలుస్తుంది. అత్యవసర పనులకు కొన్నిచోట్ల తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గ్రామ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పూర్తిస్థాయిలో ఇంటి పన్నులు వసూలు కాకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం నిధులు కూడా ఇంకా విడుదల కాలేదు. గ్రామపంచాయతీలో లోకల్ బాడీ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు జమ చేయక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రం ఈ నిధులను జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేస్తుంది. పంచాయతీల పనితీరు ఆధారంగా ఈ నిధులను 5 లేదా 6 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సకాలంలో అందక పోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎఫ్సీ నిధులు అరకొరగానే విడుదల చేసింది. వాస్తవానికి గత ఆగస్టు నాటికే పంచాయతీలు అప్పులు ఊబిలో చిక్కుకున్నాయి. దీంతో గ్రామపంచాయతీలో పొడి చెత్త తడి చెత్త సెకరించే ట్రాక్టర్లను నిలిపివేస్తున్నట్లు పంచాయతీ అధికారులు తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి సెక్రెటరీకి వినతి పత్రం అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో మార్చి ఒకటో తారీకు నుండి గ్రామపంచాయతీ ట్రాక్టర్లు నిలిపివేయనున్నట్టు అధికారుల ద్వారా వెల్లడైంది. అయితే నేటి నుండి ట్రాక్టర్లు పూర్తిగా నిలిచిపోతే ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తం అయ్యే అవకాశాలు లేకపోలేదు.