Saturday, March 15, 2025
spot_img

చౌటుప్పల్‌లో భారీగా గంజాయి పట్టివేత

Must Read
  • విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా
  • 102 కేజీల గంజాయి, కారు, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం
  • చాకచక్యంగా టోల్‌ ప్లాజా వద్ద గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు
  • ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు నెంబర్‌ మార్పు
  • వివరాలు వెల్ల‌డించిన‌ భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర

చౌటుప్పల్‌ పోలీసులు చాకచక్యంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు చౌటుప్పల్‌ పోలీసులు ఏసీపీ పి మధుసూదన్‌ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్‌ సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ మన్మధ కుమార్‌ పర్యవేక్షణలో పంతంగి టోల్‌ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం 102 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చౌటుప్పల్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న ఏసీపి కార్యాలయంలో భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన నిఖిల్‌ కైలాష్‌ గైక్వాడ్‌ (36) అనే వ్యక్తి కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి విక్రయించేవాడని తెలిపారు. తాను సొంతంగా గంజాయి వ్యాపారం చేస్తే నష్టాలు వస్తుండడంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సేతు అనే వ్యాపారిని కలిసి గంజాయి వ్యాపారం గురించి తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిన సేతుతో ఒప్పందం కుదుర్చుకొని గంజాయి రవాణా ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని నర్సీపట్నంకు చెందిన వీరబాబు అనే వ్యక్తిని కలిసి 102 కిలోల గంజాయి కొనుగోలు చేసి కారులో విజయవాడ నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలించే విధంగా పథకం రచించారు.

ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు ప్లేట్‌ నెంబర్‌ మారుస్తూ:
అఖిల్‌ కైలాస్‌ గైక్వాడ్‌ తెలివితో పోలీసుల కంటపడకుండా ఆంధ్రప్రదేశ్‌ నుండి హైదరాబాదు మీదుగా మహారాష్ట్ర వరకు కారులోనే గంజాయి తరలించడంలో ఆరి తేరిపోయాడు. నర్సీపట్నంలోని వీరబాబు దగ్గరకు వెళ్లేటప్పుడు కారుకు ఏపీ రిజిస్ట్రేషన్‌ తో ఉన్న నెంబర్‌ ప్లేట్లు బిగించుకొని వెళ్లి గంజాయి ఖరీదు చేయడం అక్కడి నుంచి హైదరాబాద్‌ మీదుగా కర్ణాటక వెళ్లే లోపు మార్గమధ్యలో కర్ణాటక నెంబర్‌ ప్లేటు మార్చడం. ఆ తర్వాత మహారాష్ట్ర బార్డర్‌ చేరుకునే లోపు మహారాష్ట్ర నెంబర్‌ ప్లేట్‌ బిగించుకుంటూ పోలీసులకు చిక్కకుండా గంజాయి వ్యాపారం చేయడం అలవాటైపోయింది. మహారాష్ట్రకు గంజాయి రవాణా కొనసాగిస్తున్నారని పక్కా సమాచారం మేరకు చౌటుప్పల్‌ డివిజన్‌ ఏసిపి ఆధ్వర్యంలో పంతంగి టోల్‌ ప్లాజా వద్ద మాటు వేసి ఏపీ నుంచి కారులో గంజాయి రవాణా చేస్తూ నిఖిల్‌ కైలాస్‌ గైక్వాడ్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు కారును తనిఖీ చేయగా 51 ప్యాకెట్‌ లో ఉన్న 102 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అరెస్ట్‌ చేసి రెండు సెల్‌ ఫోన్లు, కారు సీజ్‌ చేశామని భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర తెలిపారు.

ఎవరైనా గంజాయిని అమ్మిన, సేవించిన పోలీసులకు 100 ఫోన్‌ నెంబర్‌ సహాయంతో సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందజేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు నిర్వహించిన వారిపై చర్యలు చట్టపరంగా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

చాకచక్యంగా పనిచేసిన పోలీసులకు ప్రోత్సాహకాలు:
రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు ఆదేశాల మేరకు చాకచక్యంగా పనిచేసి102 కిలోల గంజాయిని పట్టుకున్న సందర్భంగా భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర చౌటుప్పల్‌ డివిజన్‌ ఏసిపి మధుసూదన్‌ రెడ్డిని , చౌటుప్పల్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మన్మధ కుమార్‌ని, చౌటుప్పల్‌ ఎస్సైలు యాదగిరి, కృష్ణ మాల్‌, యాదవ రెడ్డి, పోచంపల్లి ఎస్సై భాస్కర్‌ రెడ్డి, కానిస్టేబుళ్లు పగిడి శ్రీను, భరద్వాజ్‌, సందీప్‌, సతీష్‌ , పాపయ్య తదితర పోలీస్‌ సిబ్బందికి ప్రోత్సాహక బహుమతి అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS