- తార్నాక చౌరస్తాలో ప్రధాన ఫుట్ పాత్లు అన్ని కబ్జా..
- నెలనెలా మమ్మూళ్లతో మౌనం వహిస్తున్న జిహెచ్ఎంసి, ట్రాఫిక్ అధికారులు..
- తార్నాక సిగ్నల్ ఓపెన్ అయ్యాక ప్రజలకు తిప్పల తప్పవా..?
అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో కనిపించే నగరంలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. ప్రజలు నడవడానికి కూడా వీలు లేనంతగా మారిపోయాయి. అడ్డుకోవాల్సిన అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నెలనెల మామూళ్లు తీసుకొని చోద్యం చూస్తుండడంతో ఫుట్ పాత్ ల మీద వ్యాపారం చేసుకునే వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రజా సౌకర్యార్డం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుట్ పాత్ లు హోటళ్లకు పార్కింగ్ కేంద్రంగా మారడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్ పాత్లు కబ్జా, ఇబ్బందుల్లో పాదచారులు
తార్నాక నుంచి లాలపేట వెళ్లే రహదారిలో, తార్నాక నుండి హబ్సిగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ ను కబ్జా చేసి కొంతమంది వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అసలే రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారుల్లో నడక దారిన వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఫుట్ పాత్ లను ఆక్రమించి వాహనాలు పార్కింగ్ చేయడంతో నడకదారిన వచ్చేవారు రోడ్డు మీద నుండే నడవాల్సి వస్తుంది. రయ్యమని దుసుకచ్చే వాహనా ల పక్కన భయపడుతూ నడక సాగుతుందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.
తూతూ మంత్రంగా అధికారులు స్పందన..
ఫిర్యాదులు అందితే తప్ప స్పందించని సికింద్రాబాద్ జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసులు తమ ఉనికి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్భాటం చేసి చేతులు దులుపుకుంటున్నారు. పరిస్థితి మరుసటి రోజు మళ్ళీ అలాగే ఉంటుంది. తార్నాక నుండి లాలపేట వెళ్లే మార్గంలో ఉన్న తాజా కిచెన్ హొటల్ వాళ్ళు ఫుట్ పాత్ ను కబ్జా చేసి పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఫిర్యాదు వచ్చిందని సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫుట్ పాత్ ను కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. మరుసటి రోజు అందమైన రంగులతో పార్కింగ్ ట్రాక్ నిర్మించుకొని యదేచ్చగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. తార్నాక చౌరస్తాలో ఉన్న సన్మాన్ హోటల్, డెక్కన్ పామ్ రెస్టారెంట్ ముందు ఫుట్ పాత్ లను ఆక్రమించి పార్కింగ్ స్థావరాలు ఏర్పాటు చేయడంతో నడిచేవారికి దారిలేకుండా చేస్తున్న వారికే అధికారులు వత్తాసు పలుకుతుందంటంతో పాదాచారాలుకు తిప్పలు తప్పడం లేదు. ఈ మూడు హోటళ్లపై ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిరు వ్యాపారులపై ఉక్కుపాదం.. బడా హోటళ్లకు అగ్ర తాంబూలం..
ట్రాఫిక్ పోలీసుల తీరు చూస్తుంటే చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతూ.. బడా వ్యాపారులకు, హోటళ్లకు అగ్ర తాంబూలం ఇస్తున్నట్టు ఉంది. పొట్టకూటి కోసం ఫుట్ పాత్ ల మీద భోజనాలు, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న స్ట్రీట్ వెండర్స్ పై ఈమధ్య ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నాలుగు నెలల నుంచి వాళ్ళను వ్యాపారాలు చేసుకోకుండా ఇబ్బంది పెడుతూ గోసపుచ్చుకున్నారు. మరి అదే ట్రాఫిక్ పోలీసులు హోటల్ ల ఎదురుగా ప్రధాన రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్న విషయంలో మౌనం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావడం లేదు.
ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజలు..
నల్లకుంట, చిలుకలగూడ ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు. పార్కింగ్ లేని హోటళ్ళ మీద అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోరు కానీ పొట్టకూటి కోసం ఫుట్ పాత్ ల మీద భోజనం, పండ్లు అమ్ముకుంటున్న వారిపై, గల్లీలలో పార్కింగ్ చేసిన బైక్ ల ఫోటోలు తీసి చలాన్లను వేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద హోటళ్ల ముందు పార్కింగ్ చేసే వాహనాలపై ఎందుకు చలాన్లు వేయడం లేదని, వాహనాలు నిలపకుండా ట్రాఫిక్ పోలీసులు గాని అధికారులు కానీ ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు హోటళ్ల నుంచి నెల నెల జిహెచ్ఎంసి అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు భారీ మొత్తంలో మామూళ్లు వెళ్తున్నాయని అందుకే చర్యలు తీసుకోవడం మానేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో తార్నాక జంక్షన్ ను అధికారులు ప్రారంభించనున్నారు. జంక్షన్ ప్రారంభమయ్యాక ఈ హోటళ్ల ముందు చేస్తున్న అక్రమ పార్కింగ్ వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.