ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన(JANASENA) అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం అందించారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనేదానిపై ఓ క్లారిటీ వచ్చింది. లోక్సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి.. కాదు కార్పొరేషన్ పదవి అంటూ మరోసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీకోసం విశేషంగా కృషి చేశారు. అయితే ఆయనకు ఆ సమయంలో సీటు దక్కలేదు. కూటమిలో సీట్ల సర్దుబాటులో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒక మంచి పదవి దక్కుతుందని జనసేన కార్యకర్తలు ఎదురు చూశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేసినట్లు సమాచారం.