Friday, September 20, 2024
spot_img

అక్ష‌ర‌యోధుడు అస్తమయం

Must Read
  • ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు క‌న్నుమూత‌
  • రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య
  • 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన
  • 1969లో ‘అన్నదాత’ మాసపత్రికను స్థాపించిన రామోజీ
  • ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు
  • తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం
  • శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళలోనే పాఠకుల మానసపుత్రికగా ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇదే రామోజీ అస్త్రాల నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు.

చిట్ ఫండ్ ..
రైతు నేపథ్యం ఉన్న రామోజీరావు 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్‌ను నెలకొల్పారు. హిమాయత్ నగర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో సంస్థను ప్రారంభించారు. మార్గదర్శి ప్రచారం కోసం కిరణ్ యాడ్స్ పేరిట యాడ్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ, హైదరాబాద్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. కొద్ది కాలానికే మార్గదర్శి రెండో శాఖను విశాఖపట్టణంలో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకుపైగా ఖాతాదారులు, 4100 మందికిపైగా ఉద్యోగులు, 18 వేలకుపైగా ఏజెంట్లతో చక్కటి వృద్ధిలో ముందుకు సాగుతోంది.

1969లో రైతుల కోసం ‘అన్నదాత మాసపత్రిక’
రైతు కుటుంబానికి చెందిన రామోజీరావు… రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెలకువలు నేర్పేందుకు 1969లో ‘అన్నదాత’ మాసపత్రికను స్థాపించారు. ఈ పత్రిక అనతికాలంలోనే తెలుగు రైతుల మనసులను దోచుకుంది. ఆధునిక సేద్యంలో రైతుల ప్రియనేస్తంగా మారిపోయింది. ఈ పత్రిక చందాదారులకు ప్రతి ఏడాది ఒక ఉచిత డైరీని కానుకగా అందిస్తుంటారు. ఇక ఆ తర్వాతి కాలంలో విశాఖపట్నంలో డాల్ఫిన్ పేరిట హోటల్‌ను కూడా నిర్మించారు. వ్యాపార పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్, విశాఖ, ఢిల్లీల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ఆయనకు ఈ ఆలోచన వచ్చింది.

ఈనాడు పత్రిక ఏర్పాటులో కృషి..
1970 దశకంలో విజయవాడ, హైదరాబాద్‌లలోనే వార్తా పత్రిక ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే పత్రిక విశాఖ చేరాలంటే మధ్యాహ్నం అయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్‌ వద్ద రామోజీరావు ప్రస్తావించారు. విశాఖలో పత్రికను ముద్రించాలని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడినదంటూ ప్రసాద్ చెప్పిన సమాధానంతో రామోజీరావు ఏకీభవించలేకపోయారు. విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. ఓ పాత ప్రింటింగ్ మిషన్‌ను చౌక ధరకు చేజిక్కించుకుని 1974 ఆగస్టు 10న విశాఖలో ‘ఈనాడు’కు ఊపిరి పోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు.

అప్పటిదాకా ఉదయాన్నే పత్రిక ముఖం చూడని విశాఖ వాసులు ఈనాడు పత్రిక కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్‌ను అనతి కాలంలోనే రామోజీరావు పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో… 1975, డిసెంబర్ 17న ఈనాడు రెండో ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. పత్రిక సర్క్యులేషన్‌ను ఒక్కసారిగా 50 వేల మార్కును దాటించారు. మరో రెండేళ్లకు 50 వేల సర్క్యులేషన్‌తో విజయవాడ ఎడిషన్‌ను కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ఇక నాలుగేళ్లలో పత్రిక మొత్తం సర్క్యులేషన్ లక్ష దాటించేశారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎడిషన్లతో ఈనాడు పత్రిక నడుస్తోంది.

ఈనాడు పత్రిక ఆవిర్భావమే అద్భుతమనుకుంటే, తనదైన శైలిలో స్థానిక వార్తలకే అగ్రతాంబూలమిచ్చిన రామోజీ, జిల్లాల వారీగా ప్రత్యేకంగా ‘టాబ్లాయిడ్’ పేరిట అనుబంధాల ప్రచురణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం తెలుగు జాతిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతగానంటే, ఆ తర్వాత వెలువడ్డ ఏ పత్రిక అయినా, జిల్లా వార్తల కోసం టాబ్లాయిడ్‌లను ముద్రించక తప్పనంతగా. ఇందులో రామోజీ ఏమాత్రం రాజీ పడలేదు. ఈ ప్రయోగం రామోజీ కీర్తిప్రతిష్ఠలను కూడా ఇనుమడింపజేసింది. జర్నలిజంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక బీడీ గోయెంకా అవార్డును సాధించిపెట్టింది. వార్తల సేకరణకే కాక పత్రిక ప్రతులను అమ్మడానికి కూడా రామోజీ ఓ ప్రత్యేక వ్యవస్థనే నిర్మించారు. ఆ వ్యవస్థే, రామోజీ వయసురీత్యా కాస్త విశ్రమిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈనాడును దిగ్విజయంగా నడిపిస్తోంది. మెరికల్లాంటి జర్నలిస్టులను తయారుచేయడానికి ఏకంగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ను నెలకొల్పి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి, ఆ అభ్యర్థులను తన సంస్థలోనే ఉద్యోగులుగా తీసుకునే ఓ వ్యవస్థను రామోజీ తీర్చిదిద్దారు.

ఉషా కిరణ్ మూవీస్ స్థాపన
రామోజీరావు సినీ ఇండస్ట్రీలోనూ విజయవంతమయ్యారు. నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డులను కైవసం చేసుకున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్‌లను ఆయన నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ ఎంతో ఉపయోగపడింది. తన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని రామోజీరావు కొత్త పుంతలు తొక్కించారు. ‘స్టార్ డం’ ఆధారంగా చిత్ర నిర్మాణం సాగుతున్న దశలో రామోజీ ‘కథే మా హీరో’ అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేసేవారు. కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనలను కూడా ఆయన ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందవచ్చో ఆయన చేసి చూపించారు. ఆయన నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్లాడు, ప్రతిఘటన, మయూరి, మౌనపోరాటం, పీపుల్స్ ఎన్‌కౌంటర్, అశ్వని… వంటి సినిమాలు కొత్త తరహాగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామోజీకి లాభాలను తెచ్చిపెట్టాయి. మంచి కథతో సరైన సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయన్న విషయం ఆయనకు ‘ప్రతిఘటన’ సినిమా ద్వారా తెలిసిందని ఒక సందర్భంలో చెప్పారు. వివిధ భాషల్లో ఆయన 90కి పైగా చిత్రాలను నిర్మించారు.

టీవీ రంగంలోకి..
టీవీ రంగంలోకి అడుగుపెట్టిన రామోజీరావు ఈటీవీని నాణ్యతకు మారుపేరుగా నిలిపారు. 1995, ఏప్రిల్‌లో ఈటీవీని ప్రారంభించారు. వినోద ప్రధానంగా ప్రారంభమైనప్పటికీ ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. నానాటికి మారుతున్న సమాజ పోకడలకు అనుగుణంగా నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ-2ను కూడా ఏర్పాటు చేశారు. అనంతరం పలు భాషల్లోకి కూడా ఈ-టీవీ రంగప్రవేశం చేసింది. తెలుగు భాషలో ఏర్పాటు చేసిన వివిధ కేటగిరీల ఛానళ్లు కూడా చక్కటి ప్రజాదరణ పొందుతున్నాయి.

ప్రియా పచ్చళ్లతో ఆద‌ర‌ణ‌
ఈటీవీ ప్రారంభమైన ఏడాదే రామోజీ గ్రూప్ ‘కళాంజలి’ పేరిట కళాఖండాల విక్రయాలను ఎగుమతి చేసే విభాగాన్ని ప్రారంభించింది. దీనికి అనుగుణంగా వస్త్ర విక్రయ దుకాణాలను ప్రారంభించింది. ఇక ప్రియా ఫుడ్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రామోజీ ‘ప్రియా’ బ్రాండ్ పేరిట పచ్చళ్లు, వంట నూనెల ఉత్పత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ వుంది.

‘రామోజీ ఫిల్మ్ సిటీ’కి ఏర్పాటు…
చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆయన సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా గమనించారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ నిర్మాణం దిశగా అడుగులు వేశారు. దాదాపు 1,666 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను నిర్మించారు. 1996 అక్టోబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. ఈ నిర్మాణం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకుంది. అంతేకాదు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఈ ‘సిటీ’ కొనసాగుతోంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This