Friday, September 20, 2024
spot_img

స‌ర్కార్ భూములు స్వాహా

Must Read
  • గత సర్కార్‌లో కంటే మించిపోతున్న ఆక్రమణలు
  • ప్రభుత్వ భూములకు రక్షణ కరవు
  • కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు
  • రెవెన్యూ, స‌ర్వే అధికారుల ఫుల్ సపోర్ట్
  • సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం
  • సర్వే నెంబర్ 170 లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా
  • శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో యధేఛ్చగా కబ్జాలు
  • మాముళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం

ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన, అధికారులు కొత్తవారు వచ్చినా సరే సర్కారు భూములను కాపాడలేకపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత భూములకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూకాబ్జాదారులు ఎక్కువైపోతున్నారు. గవర్నమెంట్ భూములను కాపాడాల్సిన పాలకులు, అధికారులే అందుకు సహకరించడం గమనార్హం. ఎక్కడ చూసిన కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాండ్స్ పై కన్నెస్తూ వాటిని ఖతం చేస్తున్నారు. పాలకుల సపోర్ట్, అధికారుల అండదండలతో భూములను ఇట్టే కబ్జాచేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ పై నజర్ పెట్టిన కొందరూ కబ్జాకోరులు తమ పని కానిచ్చేస్తున్నారు. వీరికి సర్కారు ఆఫీసర్లు సైతం తోడ్పాటునివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

‘అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు’ సర్కారు భూములను పాలకులు, అధికారులు కబ్జాకోరులకు అప్పనంగా అప్పగించేస్తున్నారు. తెలంగాణలో ప్రైవేట్, ప్రభుత్వ భూములకు రక్షణ లేకపోవడం శోచనీయం. ప్రైవేట్ భూములకైతే భూ యాజమానులు ఉంటారు కాబట్టి.. వారితో సమస్య ఎదురవుతుందని ఉద్దేశ్యంతో కాస్త వెనుకంజ వేయవచ్చు. కానీ ప్రభుత్వ భూములకు దిక్కే లేరు. కొందరు అధికారుల నిర్లక్ష్య వైఖరితో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. డబ్భులు పడేసి అధికారులను కొనేస్తే తమ పని సులువవుతుందని భావిస్తూ నిర్భీతిగా ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అనేది కానరాకుండా పోతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, చందానగర్ లో గవర్నమెంట్ భూమికి రక్షణ కరువైంది.

‘ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి’ అన్నట్టు కబ్జాదారులు ఎక్కడన్నా ఖాళీ జాగ కనపడితే చాలు దాన్ని మింగియాలనే చూస్తుంటారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా శేరింగంపల్లి మండలం, చందానగర్ లోని కోట్ల రూపాయల విలువగల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. సర్వే నెంబర్ 170లో 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. అయితే ఈ భూమికి ఆనుకుని ఉన్న కొందరు పట్టా భూముల యజమానులు కొట్టేసేందుకు యత్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో సర్కార్ భూమిని కొంచెం కొంచెం కబ్జా చేస్తూ వస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంతకన్న తెగింపులు లేవని కబ్జాకోరులు రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ పై కర్చీప్ వేస్తూ దాన్నే ఆక్రమించుకునే వరకు వాళ్లకు నిద్రపట్టదు.

ప్రభుత్వ అధికారులైన ఎమ్మార్వో, ఆర్ఐ, ఇతర రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్ తో అమాయక ప్రజల భూములను సైతం ఆక్రమించే వారు కొందరున్నారు. అయితే కబ్జా చేస్తున్న ఈ పట్టా భూముల యజమానుల భూములు కూడా వివాదంలో ఉన్నట్లు సమచారం. కాగా అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో అధికారులు, ఈ ప్రభుత్వ భూమికి హద్దులు నిర్మించి.. కాపాడాల్సిన బాధ్యత ఉంది. అయితే మండల సర్వేయర్ సర్వే చేసి, హద్దులు నిర్ణయించకుండా.. పరోక్షంగా కబ్జాదారులకు సహరిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. మరీ శోచనీయమైన విషయం ఏమిటంటే ఎమ్మార్వో కూడా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం దారుణం. ఎమ్మార్వో చిత్తశుద్ధితో ప్రభుత్వ భూమిలో ఏడీ సర్వే చేయించి.. సంబంధిత ప్రభుత్వ భూమిని కాపాడాల్సి ఉంది. కానీ ఇక్కడ నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఇప్పటికైనా 170 సర్వే నెంబర్ లోని 10 గుంటల ప్రభుత్వ భూమిని సర్వే చేయించి హద్దులు నిర్ణయించి ఆ కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జాకు గురికాకుండా చూడాల్సిన స్థానిక తహాశీల్దార్, రెవెన్యూ సిబ్బంది కనీసం పట్టింపులేకపోవడం గమనార్హం. కబ్జాదారులకు ఎమ్మార్వో, మండ‌ల స‌ర్వేయ‌ర్ మ‌హేష్‌ నుంచి సపోర్ట్ ఉందని తెలుస్తోంది.

ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురి అవుతున్న ఎన్ని ఫిర్యాదులు చేసిన ప‌ట్టించుకోకుండా ఉండడం పట్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారులు క‌బ్జాదారుల‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ప్రేక్ష‌క పాత్ర‌లో ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైన ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్, ఉన్న‌తాధికారులు వీరిపై కఠిన చ‌ర్య‌లు తీసుకొని ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని స్థానిక ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This