Friday, September 20, 2024
spot_img

ఆస్తి ప‌న్నులో భారీ స్కాం..

Must Read
  • ప్ర‌త్యేక ప్యాకేజీలతో ప్ర‌భుత్వాన్ని మోసం చేసిన‌ డీపీఓ ఆర్‌. సునంద‌, అప్ప‌టి డిఎల్‌పిఓ, ఎంపీఓ, కార్య‌ద‌ర్శులు, స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యులు
  • తెలంగాణ స‌ర్కార్‌కు దివీస్ కంపెనీ భారీ గండీ
  • సుమారు రూ.14 కోట్ల ట్యాక్స్ హంపట్
  • 91.06 ఎకరాలకు కేవలం రూ.72లక్షలు ట్యాక్స్ ఫిక్స్
  • గజానికి రూ.1500లు తగ్గించిన వైనం
  • ఆస్తి పన్ను మూల‌ధ‌నం విలువ రూ. 1 వేసే చోటా 20 పైస‌లే..
  • లక్షల్లో ప్యాకేజీలు తీసుకున్నట్లు ఆరోపణలు
  • నీళ్లు, గాలి కాలుష్యంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
  • పాలకులు, అధికారుల అండతో కొనసాగుతున్న దివీస్ ఫార్మా
  • స‌ర్కార్‌కే టోపి పెట్టినా దివీస్ యాజ‌మాన్యం, అధికారుల‌పై చర్యలు ఉండేనా.?

‘బరితెగించిన కోడి బజాట్లోకెళ్లి గుడ్డు పెట్టినట్లు’ నల్గొండ జిల్లా చౌటుప్పల్ లోని ప్రముఖ దివీస్ ఫార్మా ల్యాబోరేటరీ యవ్వారం. ఈ కంపెనీతో సకలం పాడై జనం కోడై కూస్తుంటే.. ఈ కొంత ముచ్చట విన్నోళ్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుర్రు. ఈ కంపెనోడి ఇంట్లా పీనుగెల్లా వీడికి ఏం తక్కువైంది. సర్కార్ కు రుసుం కడతలేదట అనబట్టిరి. అంత పెద్ద మందుల ప్యాక్టరీ పెట్టుకుని పన్ను ఎగ్గొడ్తే ఎవరూ ఊకుంటరు. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్టు నీటిని, గాలిని కలుషితం చేస్తూ మనుష్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దివీస్ కంపెనీ జేబునిండ పైసలు సంపాదిస్తూ ప్రభుత్వానికి నామాలు పెట్టడం జూస్తే తూ.. అని ఊస్తున్నరు. ప్రభుత్వాలు, అధికారులు మారిన వాళ్లకు వెళ్తున్న మాముళ్లతో ఈ దందా సాగుతుందనేది బహిరంగంగానే చర్చ నడుస్తోంది. కానీ అసలు విషయం తెలియక ఇన్ని రోజులు డబ్బులు దండుకోని లైట్ తీసుకున్న వాళ్లంతా ఈ ముచ్చట తెలిసి ముక్కున వేలేసుకుంటర్రు.

చౌటుప్పల్ లోని దివీస్ ల్యాబోరేటరీ కంపెనీ వల్ల వాతావరణం మొత్తం కాలుష్యమై పోతోంది. ఇక్కడ జీవించే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. లేని పోని రోగాలు తెచ్చుకుంటూ జనం సతమతవుతున్నారు. ఎన్ని గొడవలు చేసిన, ప్రభుత్వాలు, అధికారులకు కంప్లైంట్ జేసిన ఫలితం లేక విసిగిపోయారు. ఇదీట్లా ఉంటే వంద ఎకరాల్లో ఉన్న దివీస్ ల్యాబోరేటరీ కంపెనీ పన్ను చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డు తెలుస్తోంది. ఈ కంపెనీ భారీ మొత్తంలో ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం లేదనేది వాస్తవం. గవర్నమెంట్ కు దివీస్ కంపెనీ ప్రతి యేటా సుమారు రూ.14, 43,83,148 లు ట్యాక్స్ ఎగ్గొడ్తుంది. దివీస్ ఫార్మా ఇండస్ట్రీ అధికారికంగా మొత్తం 91.06 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం ఉంది. అయితే ఇందుకుగాను ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూ వస్తుంది. కానీ వాణిజ్య స్థలమైన గజానికి రూ.3600 చొప్పున పన్ను చెల్లించాల్సింది పోయి కేవలం రూ.2100 మాత్రమే పన్ను కట్టడం వెనుక ఉన్న మతాలబ్ తెలిసి అందరూ అవాక్కు కావాల్సిందే.

త‌క్కువ‌లో త‌క్కువ సుమారు రూ. 14కోట్లు ట్యాక్స్ పే చేయాల్సిన కంపెనీ కేవ‌లం రూ. 72,68,791 లు కడుతోంది. వాస్తవానికి దీని వెనుక జిల్లా పంచాయ‌త్‌రాజ్ అధికారి ఆర్‌. సునంద‌, అప్ప‌టి డిఎల్‌పిఓ, ఎంపీఓ, కార్య‌ద‌ర్శులు, స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల‌తో స‌హా అంద‌రి హస్తం ఉండడం గమనార్హం. 91.06 ఎకరాలకు గాను రూ. 14కోట్లకు పైగా ఆస్తి పన్ను పే చేయాల్సి ఉండగా కేవలం రూ.72 లక్షలు ట్యాక్స్ కట్టేలా పంచాయతీ డిపార్ట్ మెంట్ అధికారులు భారీ స్కెచ్ వేశారు. దీనికోసం వారు భారీగానే ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధ‌న‌ల ప్ర‌కారం 91.06 ఎక‌రాల‌కు గాను మార్కెట్ వాల్యూవేష‌న్ ప్ర‌కారం గ‌జానికి రూ. 3,600 లు తీసుకోవాలి.. కానీ, ఇక్క‌డ అధికారులు స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం దివీస్ యాజ‌మాన్యంతో కుమ్మ‌కై గ‌జానికి రూ. 2,100 లు వెల‌క‌ట్ట‌డం జ‌రిగింది. అదేవిధంగా పంచాయ‌త్ రాజ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆస్తి పన్ను మూలధన విలువ ఇంటి ప‌న్న‌కు 12 పైస‌ల నుండి రూ.1 వ‌ర‌కు వేయ‌డం జ‌రుగుతుంది. దివీస్ ప‌రిశ్ర‌మ వ‌ల్ల ఇక్కడ జీవించే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతూ… లేని పోని రోగాలు తెచ్చుకుంటూ జనం సతమతవుతున్నారు. దివీస్ కంపెనీ వ్యాపారం చేసుకుంటూ.. జేబునిండ పైసలు సంపాదిస్తుంది.. అలాంటి కంపెనీకి దొంగ‌ల ముఠ దివీస్ లాబోరేట‌రీతో జ‌త‌క‌ట్టి ఆస్తి పన్ను మూల‌ధ‌నం విలువ రూ. 1 వేసే చోటా 20 పైస‌లు మాత్రం వేసి కంపెనీకి భారీ ఎత్తున ప‌న్ను త‌గ్గించి సంస్థ‌కు లాభాలు చేకూరుస్తుంది.. ఈ ప‌న్ను(రూ. 72,68,791) కూడా 2021 – 22 సంవ‌త్స‌రంలోనే ఆస్తి ప‌న్ను మ‌దింపు చేయ‌డం జ‌రిగింది. అత‌కు ముందు కార్య‌ద‌ర్శి ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం కేవ‌లం రూ. 9 నుంచి రూ. 10 లక్ష‌ల‌ వ‌ర‌కు మాత్ర‌మే చెల్లించేద‌ని చెప్ప‌డం విస్మ‌యానికి గురిచేస్తుంది. దీనివ‌ల్ల ప్ర‌తి సంవ‌త్స‌రానికి సుమారు గ్రామ‌పంచాయ‌తీకి ప‌న్నురూపేన రావాల్సిన మొత్తం రూ. 14, 43,83,148 లు న‌ష్టం వాటిల్లుతుంది. జిల్లా కలెక్టర్ నుంచి మొదలు ఓ గ్రామ సర్పంచ్ దాకా స్పెషల్ ప్యాకేజీలు తీసుకోవడం గమనార్హం. దివీస్‌ ల్యాబోరేటరీ కంపెనీ నుంచి అందరూ కలిసి భారీగా ముడుపులు తీసుకొని, ఆ కంపెనీకి పెద్ద ఎత్తున పన్ను ఎగవేసేలా చేసినట్లు తెలుస్తోంది. గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు రూ. 72,68,791 లు ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్లు తెలిపారు.

‘ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకుడు’ అన్నట్టు అవినీతి అధికారులు అంతా కలిసి ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగ్గొట్టే ప్లాన్ చేశారు. వాస్తవానికి దివీస్ ల్యాబోరేటరీతో స్థానిక ప్రజలే నీరు, గాలి వల్ల అనారోగ్యం బారినపడుతూ నష్టపోతుంటే.. ఇప్పుడు పన్నుల ద్వారా నడిచే గవర్నమెంట్ ను మోసం చేయడం చాలా దారుణం. సర్కార్ అంటే రాష్ట్ర ప్రజలన్న సంగతి మరిచిన వీళ్లు డబ్బులకు తలొగ్గి కోట్ల రూపాయలు కంపెనీకి సేవ్ చేస్తున్నరంటే విచిత్రంగా ఉంది. జిల్లా పంచాయ‌త్‌రాజ్ అధికారి ఆర్‌. సునంద‌, అప్ప‌టి డిఎల్‌పిఓ, ఎంపీఓ, కార్య‌ద‌ర్శులు, స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యులు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొని విదేశీ టూర్లకు పోయిర్రంటే దివీస్ ల్యాబోరేటరి వారికి ఎంత చెల్లించింది.. దానికి ఏ స్థాయిలో ఆ కంపెనీ ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టుతుందో అర్థం చేసుకోవాలి. పాలకులు, అధికారుల అండ దండలతో కొనసాగుతున్న దివీస్ ఫార్మా కంపెనీ గురించి తెలిసి.. గవర్నమెంట్ కే టోపి పెట్టడంతోనైనా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.

ఆస్తి ప‌న్ను మ‌దింపులో గోల్‌మాల్ కు పాల్ప‌డిన అప్ప‌టి జిల్లా క‌లెక్ట‌ర్‌, డీపీఓ ఆర్, సునంద‌, అప్ప‌టి డిఎల్‌పిఓ, ఎంపీఓ, కార్య‌ద‌ర్శులు, స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల అవినీతి బాగోతం పూర్తి ఆధారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం అవినీతిపై అస్త్రం..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This