- ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న పిల్లర్లు..
- అసంపూర్తిగా వదిలారు పనుల వైపు కన్నెత్తికూడా చూడని ప్రజాప్రతినిధులు, అధికారులు
- బస్తీ ప్రజలపై ఇంత చిన్నచూపు ఎందుకు…
ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ఓట్లని అడక్కున్న నాయకులు, ఎన్నికల్లో గెలిచాక ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం అయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఏకలవ్య నగర్ బస్తీలో గతంలో ఉన్న అంగన్వాడి బంగ్లాను కూల్చి, నూతన బంగ్లాను ఏర్పాటు చేస్తామని 12 లక్షల రూపాయల వ్యయంతో పనులు మొదలుపెట్టి కేవలం పిల్లర్ల నిర్మాణం చేసి బంగ్లాను అసంపూర్తిగా వదిలేశారు. వేసిన పిల్లర్లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నా, 8 నెలల నుండి ఇటువైపు, ప్రజాప్రతినిధులు గాని అధికారులు గానీ తొంగి చూసిన పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. పనులు అసంపూర్తిగా వదిలేయడానికే అయితే, అసలు బస్తీలో పనులను ఎందుకు మొదలు పెట్టారో ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని బస్తీ వాసులు మండిపడుతున్నారు. కాలనీలకు ఒక న్యాయము బస్తీలోకొక న్యాయమా, కాలనీలలో ఏదైనా పని మొదలు పెడితే పనులు పూర్తయ్య వరకు పనులు కొనసాగిస్తారు, అదే బస్తీలలో తూతు మంత్రంగా శంకుస్థాపనలు చేస్తూ, పనులు మొదలుపెట్టి ప్రజలను మభ్యపెట్టి అసంపూర్తిగా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇదే కోవలో ఇంద్ర నెహ్రూ నగర్ బస్తిలో గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని పలుమార్లు కొబ్బరికాయలు కొట్టిన, ఈరోజు వరకు నిర్మాణం మొదలుపెట్టిన దాఖలాలే లేవు. అయినా రాజకీయ నాయకుల మాటలకు మోసపోవటం బస్తీ వాసులకు షరా మామూలుగా మారింది. ప్రతి ఎలక్షన్స్లో బస్తి ప్రజలను నాయకులు అభివృద్ధి పేరుతో మభ్యపెట్టి పేదల ఓట్లు దండుకొని పదవులు అనుభవిస్తున్నారు. అయినా బస్తీ వాసులు అభివృద్ధి చెందింది లేదు బాగుపడదు లేదు. మరి ఇప్పటికైనా ఓట్లు వేసిన పజల కోసం స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే చొరవ తీసుకొని అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారా, లేదా మళ్లీ గెలిస్తే పనులే పూర్తి చేస్తామని డైలాగులు కొట్టి చేతులు దులుపుకుంటారో వేచి చూడాలి.