- ఏపికి కేటాయించబడ్డ డా. శ్రీనివాసులు తెలంగాణలోని ఎంఎన్జేలో ఎలా విధులు నిర్వర్తిస్తారు..?
- అలాట్మెంట్ ఆంధ్రకు.. నౌకరీ మాత్రం తెలంగాణలో
- ఎంఎన్జే ఆసుపత్రి ప్రొ. ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ వైచిత్రం
- ఆంధ్రాలో రిటైర్డ్ అయినా.. తెలంగాణలో జీతం
- ఒక్కగానొక క్యాన్సర్ ఆసుపత్రిలో డైరెక్టర్గా ఆంధ్ర డైరెక్టరా..?
- తెలంగాణ అంకాలజిస్ట్ కు అన్యాయం
- సమస్య పరిష్కారం కోసం సర్కార్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
ఉద్యోగం ఏదైనా చక్రం తిప్పే కెపాసిటీ ఉంటే చాలు.. అనుకున్న సీట్లో ఆయాసం లేకుండా కూర్చోవచ్చు. అనుకున్నన్ని రోజులు ఉద్యోగం వెలగబెట్టొచ్చు. ఇక చట్టాలు, నిబంధనలంటారా..? అవి అమలు అయ్యేసరికి మనమే ఉండకపోవచ్చు.. ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయి ఏం చక్కా ఇంటి పట్టున సేద తీరోచ్చు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలోని గుంటూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ ఉద్యోగిగా అలార్ట్ అయి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఒక్కగానొక క్యాన్సర్ హాస్పిటల్లో కీలకమైన డైరెక్టర్గా ఉన్న డాక్టర్ శ్రీనివాసులు ముక్త. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రెండు రాష్ట్రాల ఉద్యోగులకు కమలనాథ్ కమిషన్ ఆప్షన్లను ఇచ్చింది. అందులో భాగంగానే ఎంఎన్జే హాస్పిటల్లో ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీగా పని చేస్తున్న డా.శ్రీనివాసులును ఆప్షన్ అడగ్గా.. ఆయన తనకు ఏపీనే కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కే ఆయన ఆప్షన్ పెట్టుకున్నారు. అయితే డా.శ్రీవాసులు కోరిక మేరకు కమలనాథ్ కమిషన్ కూడా ఆయనను ఏపీకి అలార్ట్ చేసేసింది.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా… ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన జాబ్ తన హోదాకు తగినట్లు లేదని.. కేటాయింపు పోస్ట్ ప్రాతిపదికన అలార్ట్ కాలేదని 09 మార్చి, 2017న ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈయన అభ్యర్థనను పరిశీలించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం శ్రీనివాసులుకు మరోసారి ఆప్షన్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. మూడు నెలలో శ్రీనివాసులు వ్యవహారాన్ని తేల్చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అప్పటి వరకు శ్రీనివాసులు ఎంఎన్జే ఆసుపత్రిలోనే ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ గా పని చేయవవచ్చని స్పష్టం చేసింది. ఇక అప్పటి నుంచి శ్రీనివాసులు ఎంఎన్జే కేంద్రంగానే జీతం తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే శ్రీనివాసులు అభ్యర్థన పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర సర్కార్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆయన అభ్యర్థనపై స్పష్టతనివ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఇలా 10 డిసెంబర్ 2018, 04 జనవరి, 2019, 7 ఏప్రిల్, 2022, 12 ఏప్రిల్ 2022న రెండు రాష్ట్ర సర్కార్లకు కేంద్రం లేఖలు రాసింది. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిన రిమైండర్ లెటర్ల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ 5 నవంబర్, 2022న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరపున తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. తెలంగాణలో ఎలిజిబుల్ ప్రోఫెసర్స్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ చాలా మంది ఉన్నారని.. డా.శ్రీనివాసులు ఏపీ రియార్జనైజేషన్ ఆక్ట్ ప్రకారం సరిగానే ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడినందున ఆయన సేవలు తెలంగాణకు అవసరం లేదని స్పష్టంగా తెలియజేశారు.
అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా.. డా.శ్రీనివాసులు ఏపీ లోని గుంటూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి కేటాయించబడినప్పటికీ.. ఏదో వంకతో ఆయన తెలంగాణలోనే ఉండిపోవడం గమనార్హం. అంతేకాక డా.శ్రీనివాసులు తెలంగాణలో ఉన్న ఒక్కగానొక క్యాన్సర్ హాస్పిటల్కి ఉన్నతమైన డైరెక్టర్ పోస్ట్లోనూ ఆశీనులు కావడం గమనార్హం. వాస్తవానికి ఏపీకి కేటాయించబడిన డా.శ్రీనివాసులు ఎప్పుడో అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిటైర్డ్ అయిపోయారు. ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 63 సంవత్సరాలే. ఈ లెక్కన ఆయన ఇప్పటికే రిటైర్డ్ అయిపోయారు. కానీ, తెలంగాణలో రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు ఉన్నందున శ్రీనివాసులు ఇప్పటికీ ఇక్కడ ఉద్యోగం చేస్తుండడం విశేషం. ఫలితంగా నిజమైన తెలంగాణవారికి, ఇక్కడి ఆంకాలజి వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
శ్రీనివాసులు కారణంగా వారు తమ పొజిషన్స్ కోల్పోవాల్సి వస్తుందని అర్హులైన ఉద్యోగస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఆయన వెంటనే తన ఉద్యోగం నుంచి రిలీవ్ అయిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగస్థులు కోరుతున్నారు.
ఐఏఎస్లకు వర్తించని రూల్స్.. ఈ డైరెక్టర్కు ఎలా వర్తించింది…?
తాము పని చేస్తున్న రాష్ట్రంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, అదే సమయంలో డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్స్, సృజనలకు బిగ్ షాక్ తగిలింది. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన వారు ఆ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాంటప్పుడు ఐఏఎస్ అధికారులే డీఓపీటీ ఆదేశాలను గౌరవించి ఏపీలో విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఎంఎన్జే డైరెక్టర్ డా. శ్రీనివాసులు ఏ విధంగా తెలంగాణలో విధులు నిర్వర్తిస్తారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి..