- ప్రజలను నిండా ముంచుతున్న ఆస్పైర్ స్పేసెస్ ఫ్రీ లాంచ్ కంపెనీ
- మల్లంపేటలో మాయ చేసి కొల్లూరులో కోట్లు కొల్లగొడుతున్న వైనం
- కంపెనీ చైర్మన్ టి నరసింహారెడ్డి లీలలు అన్ని ఇన్ని కావు
- తక్కువ ధరకే ప్లాట్ల పేరిట కోట్లు వసూలు చేస్తున్న ఆస్పైర్
- ఆకర్షణీయమైన బ్రోచర్లతో కోనుగోలుదారులకు ఎర
- హెచ్ఎండీఏ, రేరా అనుమతులు లేకుండా ఆస్పైర్ మోసాలు
- మామూళ్ల మత్తులో రేరా, రెవెన్యూ, హెచ్ఎండీఏ శాఖ అధికారులు..?
- ప్రీలాంచ్పేరుతో సుమారుగా 300 మందికి పైగా మోసం
మాయా లేదు మర్మం లేదు అంటూ వెనకటి రోజుల్లో గ్రామాల్లోకి కొంతమంది గారడి వారు వచ్చి వారి విద్యను ప్రదర్శించి వారి పొట్ట కూటికోసం ఎంతోకొంత డబ్బులు అడుక్కొని వారి జీవనం కొనసాగించేవారు. ఇప్పుడు అలాంటి గారడి మాయగాల్లే ఈ ప్రీ లాంచ్ పేర్లతో హైదరాబాద్ చుట్టుముట్టు నలుమూలల ప్రజలతో గారడి చేస్తున్నారు. వీరు కూడా వారిలాగే మాయా లేదు మర్మం లేదు అంటూ అమాయక ప్రజల దగ్గర వందల వేల కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు అలాంటి గారడీగాళ్ళ మాయలను ఆదాబ్ హైదరాబాద్ పత్రిక మీకు కళ్ళకు కనపడినట్టు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఆస్పేర్ స్పేసెస్ కంపెనీ చైర్మన్ డి నరసింహారెడ్డి లీలలు ఆయన చేపడుతున్న మాయా ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం.
మల్లంపేట, కొల్లూరులో వీరికి సొంతంగా ల్యాండ్ లేదు.. అయినా తమ పేరు మీద కంపెనీ పేరు మీద ల్యాండ్ ఉన్నది అని చెబుతూ ప్రీ లాంచ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు ఆస్పైర్ స్పేసెస్ చైర్మన్ టి నరసింహారెడ్డి.. అసలు ఈ అస్పైర్ స్పేసెస్ కంపెనీ చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. అమాయకుల డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.. మరీ వీరు చేపట్టిన కంపెనీలు ఇక్కడ పూర్తి కాకపోవడంలో ఏదైనా దురుద్దేశం ఉందా అనే కోణంలో కూడా బాధితులు, ప్రజలు ఆలోచించాలి.. ప్రజలను మోసం చేయడంలో ఈ ప్రీ లాంచ్ కంపెనీలు నేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అమాయక ప్రజలే వీరికి టార్గెట్ గా కనపడుతుంది నమ్మినారా నట్టేట మునిగినట్టే కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టి ఇలాంటి దొంగ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఇంకా పోయినట్టే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, గండిమైసమ్మ మండలంలోని మల్లంపేటలో 4.2 ఎకరాల్లో రెండు ప్రీమియం టవర్స్ మరియు హై రేస్ అపార్ట్మెంట్స్ చేపడుతున్నామని చెబుతూ ఒక్కొక్కటి 32 ఫ్లోర్లతో టు బిహెచ్కె మరియు త్రీ బిహెచ్కె ఫ్లాట్లను నిర్మిస్తున్నామని చెబుతూ మొత్తంగా 400 ప్లాట్లు నిర్మిస్తున్నామని ప్రీ లాంచ్ లో చాలా తక్కువకే ధరకే మీకు ఫ్లాట్లను విక్రయిస్తామని చెబుతూ ఇప్పటికీ 300 పైచిలుకు ప్లాట్లను విక్రయించి సుమారు 150 కోట్లకు పైగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మేడ్చల్ మల్కాజ్గిరి, దుండిగల్ గండి మైసమ్మ మండల్, మల్లంపేటలో 4.2 ఎకరాలు వీరిదిగా చెబుతున్నటువంటి భూమి వీరి పేరు మీద ఉన్నది రెండు ఎకరాలు మాత్రమే మిగిలింది డెవలప్మెంట్ కు తీసుకున్నామని చెబుతూ పర్మిషన్స్ కి వెళ్ళామన్నారు. కానీ ఇప్పటివరకు ఆ భూమికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ రాలేదని తెలుస్తోంది. పైగా మీరు చెబుతున్నటువంటి ల్యాండ్ చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు దానిలో ఒక్కొక్క సైన్ బోర్డులో ఒక్కొక్క టి చూపిస్తూ వచ్చిన కస్టమర్లకి మాకు పర్మిషన్స్ వచ్చినాయి అని చెబుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
అంతేకాకుండా అత్యంత ఖరీదైన ప్రాంతం అయినటువంటి తెల్లాపూర్ లో 16 ఎకరాలలో హై రైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పి ఇక్కడ కూడా ప్రీ లాంచ్ పేరుతో అక్రమ వసూలు పాల్పడ్డారు. ఇక్కడ కూడా వీరికి గాని వీరి కంపెనీ కానీ ఎలాంటి ల్యాండ్ బ్యాంక్ లేదు. ఎలాంటి పర్మిషన్స్ కి ఇంతవరకు వెళ్ళలేదు.. భారీ ఎత్తున ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా వినియోగదారులకు అందమైన ప్రపంచాన్ని చూపిస్తూ దోచుకోవడం జరుగుతోంది. ఏజెంట్లకు కూడా పెద్ద ఎత్తున కమిషన్ ఆశ చూపి వారి ద్వారా అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో పట్టువదలని విక్రమార్కుల్ల ఏజెంట్లు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు వీరు మొత్తం రెండు ప్రాజెక్టుల నుంచి సుమారుగా 300 కోట్లు పైగా వసూలు చేశారని తెలుస్తోంది.
రియాల్టర్లు కొనుగోలుదారులకు బుకింగ్ సందర్భంలో రంగురంగుల బ్రోచర్లను చూపిస్తూ.. మాయమాటలు చెప్పి మోసాలు చేయడం జరుగుంది.. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం చట్టబద్దత కలిగిన రేరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చట్టాన్ని తీసుకురావడం జరిగింది.. కానీ రేరా నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుమును చెల్లించుకోని, రియాల్టర్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్న, ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో, కుంటల్లో, నిషేదిత జాబితాలో ఉన్న భూముల్లో సైతం భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్న రేరా అనుమతులు ఇవ్వడం శోచనీయం.. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 8 ఫ్లాట్లకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణం జరిపినా, ప్రకటనలు విడుదల చేసినా చర్యలు ఉంటాయని ప్రకటించినప్పటికి ఇలాంటి అక్రమార్కులు అవేవి లెక్కచేయకుండా హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ వారిచ్చే మాముళ్లమత్తులో పడి ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం మరిచిపోయారు.
ఇప్పటికైనా రేరా, హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు స్పందించి ఆస్పైర్ స్పేసెస్ కంపెనీ చేస్తున్న ప్రీ లాంచ్ మోసాలను అడ్డుకొని న్యాయం చేయాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..