భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో భారత జట్టు ఆధిక్యాన్ని 1-1తో సమం చేసింది. ఆటతో పాటు ఆటగాళ్ల మధ్య గొడవలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మరింత రసవత్తరంగా మార్చింది. తొలి టెస్టులో హర్షిత్ రాణా X మిచెల్ స్టార్బై యశస్వీ జైస్వాల్ X మిచెల్ స్టార్క్ మధ్య కవ్వింపులు సాగాయి. ఇక రెండో టెస్టులో ట్రావిస్ హెడ్ X మహ్మద్ సిరాజ్ మధ్య హైవోల్టేజ్తో జరిగిన వాగ్వాదం ఐసీసీ చర్యలు తీసుకునేంత స్థాయి వరకు వెళ్లింది. దీనికి తోడుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు కీలకంగా మారడంతో సిరీస్పై అంచనాలు భారీగా పెరిగాయి.
అయితే మూడో టెస్టు భారత తుది జట్టులో మార్పులు చేయాలని మాజీలు, విశ్లేషకులు సూచిస్తున్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకోవాలని ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణాను ప్లేయింగ్ 11లో కొనసాగించాలన్నాడు. “తుది జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంటుందని భావిస్తున్నా. బ్యాటింగ్ అంచనాలను అందుకోలేకపోతున్న నేపథ్యంలో అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వస్తాడనుకుంటున్నా. హర్షిత్ రాణా స్థానంలో మరో పేసర్ను తీసుకోవాలా అని అడిగితే.. వద్దని చెబుతాను. తొలి మ్యాచ్లో బాగా ఆడిన అతనికి మద్దతు ఇవ్వాలి” అని పుజారా పేర్కొన్నాడు. తొలి టెస్టులో ఆడిన సుందర్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 31 పరుగులు చేశాడు. 17 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టు ఆడిన అశ్విన్ 29 పరుగులు చేశాడు. 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ పడగొట్టాడు. మరోవైపు హర్షిత్ రాణా తొలి టెస్టులో 29 ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో 16 ఓవర్లలో 5.40 ఎకానమీ రేటుతో పరుగులిచ్చి వికెట్ పడగొట్టలేదు. కాగా, గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.