- ఏడుపాయల్లో చికెన్ సెంటర్ నిర్వాహకుల ఇష్టారీతి
- రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్ వ్యర్థాలు
- దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు
- భరించలేక భక్తుల ఇబ్బంది
ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం వద్ద కొంతమంది చికెన్ సెంటర్ల యజమానుల నిర్వాకం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తుంది. దేవస్థానం ప్రాంతంలో అక్కడక్కడ వెలసిన చికెన్ సెంటర్ల నిర్వాహకులు చికెన్ కడిగిన నీళ్లను భక్తులు దుర్గమ్మ దర్శనానికి వెళ్ళే రోడ్లపై పారబోస్తున్నారు. భక్తులు అదే మలినమైన నీళ్లపై నుంచి దుర్గామాత దర్శనానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చికెన్ వ్యర్థాలను రాత్రిపూట నాగ్సానిపల్లి వైపు వెళ్లే రహదారికి ఇరువైపులా కల్వర్టుల కింద పారేసి వెళ్తున్నారు. మరుసటి రోజు ఆ వ్యర్థాలు కుళ్లిపోయి కల్వర్టుల నుంచి దుర్వాసన వస్తుంది. రహదారిపై దుర్గామాత దర్శనానికి వెళ్లే భక్తులు, ఇతర వాహనదారులు దుర్వాసనను భరించలేకపోతున్నారు. దేవాలయం ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా ప్రతినిత్యం చెత్త సేకరిస్తున్నప్పటికీ చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం చికెన్ వ్యర్థాలను రోడ్ల పక్కనే పారేయడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణ ట్రాక్టర్ వస్తున్నా, ఏడుపాయల పరిసర ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం అయినప్పటికీ, చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం రోడ్ల పక్కనే వేయడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయాల వద్ద జంతుబలి నిషేధం ఉన్నప్పటికీ, భక్తులు మొక్కులు చెల్లించుకోవడం కోసం, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికై ఒకేచోట మేకలను, కోళ్లను కోయాలనే ఉద్దేశంతో గతంలో కబేళాను ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం మేకకు ఒక రేటు, కోడికి మరో రేటు నిర్ధారించి కబేలా నడిపిస్తున్నారు. అయితే దేవాలయ పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా ఇక్కడ నిర్వహిస్తున్న కబేళా కాదని చికెన్సెంటర్ల నిర్వాహకులు రోడ్ల వెంట చికెన్ వ్యర్ధాలు పారేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ కార్యనిర్వాహణాధికారి చొరవ తీసుకొని చికెన్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.