- అక్రమ నిర్మాణదారులతో జీహెచ్ఎంసీ అధికారుల కుమక్కు
- అక్రమ నిర్మాణాలకు వంతపాడుతున్న డిప్యూటీ కమిషనర్ దివాకర్..!
- ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్న పట్టించుకోని అధికారి
- అంబర్ పేట నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు
- అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా..
- ముడుపులు పుచ్చుకొని మౌనం వహిస్తున్నడిప్యూటీ కమిషనర్
“అతి వినయం ధూర్త లక్షణం” అన్నారు పెద్దలు. అట్లనే ఉన్న జీహెచ్ఎంసీ(GHMC), టౌన్ ప్లానింగ్ అధికారులు పరిస్థితి. అధికారులను మెచ్చుకుంటుంటే ఇచ్చుకపోతున్నరు. హైదరాబాద్ పరిధిలో వీరి పెత్తనం మాములుగా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బులు దండుకునుడే పనిగా పెట్టుకున్నరు. ఎక్కడ, ఎలాంటి నిర్మాణాలు అయినా ఓకే… కానీ, మాకేంటి అన్నట్టుగా వసూల్ దందా చేసుకుంటున్నరు. ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన ఎవరుంటే ఏంటీ అన్నట్టుగా ధీమాతో ఉన్నారు. ఉన్నతాధికారులకు సైతం వాటాలు ముట్టచెప్పుతూ తాము జేబులు నింపుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలకు ఆయువు పోస్తున్నారు. పిల్లి పాలు తాగి నన్నేవరూ చూడలేదులే అన్నట్టుగా జీహెచ్ఎంసీ ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసి అంబర్ పేట్ సర్కిల్ -16 పరిధిలోని పలు డివిజన్ లలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీ అంబర్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్కు, ఏసీపీ దేవేందర్ లకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల చొరవచూపితే బాగుంటుందని అంటున్నారు.
అంబర్ పేట్, నల్లకుంట, డిడి కాలనీ, సిఈకాలనీ, బతుకమ్మ కుంట, నందనవనం, వైభవ్ నగర్, నల్లకుంట డివిజన్ లోని న్యూ రామాలయం, ఓల్డ్ రామాలయం, బర్కత్ పురా బస్ డిపో తదితర ప్రాంతాల్లో కొంతమంది అక్రమ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో కొంతమంది బిల్డర్లు జిహెచ్ఎంసి అనుమతి కన్నా అధిక అంతస్తులను నిర్మిస్తున్నారు. జిహెచ్ఎంసి నుంచి జి ప్లస్ టూ అనుమతి తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఐదారు అదనపు అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అలాగే ఏమాత్రం సెట్ బ్యాక్ లేకుండా బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తూ పార్కింగ్ స్థలాలను సైతం వదలడం లేదు. దీనికి తోడు భవనాల పైన పెంట్ హౌస్ లను నిర్మిస్తున్నారు. వీటిపై జిహెచ్ఎంసి సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్న వారు పట్టించుకోవడం లేదని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.
డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు బిల్డర్ల నుండి భారీ ఎత్తున డబ్బులు అంది ఉంటాయనే అనుమానాలు తలెత్తున్నాయి. అంతస్తుకు ఇంత చొప్పున అధికారులకు, సెక్షన్ ఆఫీసర్ లకు ముడుపులు అందుతుండడంతో ఈ క్రమంలోనే వారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.. ఈ అక్రమ నిర్మాణాలకు టౌన్ప్లానింగ్ అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని అక్యూపెన్సీ సర్టీఫికెట్ కూడా జారీ చేయడం శోచనీయం. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు ట్యాక్స్ ఫిక్సెషన్లో అవకతవకలకు పాల్పడి, తక్కువ మొత్తంలో పన్ను విధించడం జరుగుతోంది. కమర్షియల్ భవనాలకు కూడా రెసిడెన్షియల్ భవనాలుగా మారుస్తూ, ట్యాక్స్ ఫిక్సెషన్ చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని వల్ల జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీ మొత్తంలో గండి పడుతుంది. లక్షల్లో జీతాలు తీసుకుంటూ.. స్వార్థ ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీని మోసం చేస్తున్న ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వారికి ఒకలా, డబ్బున్నోళ్లకు మరోలా జీహచ్ఎంసీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ను ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా.. ఫిర్యాదు కాఫీని టౌన్ప్లానింగ్ విభాగానికి అందించా.. నేను విభాగాన్నే కాకుండా వేరే విభాగాల పనులు చేస్తుండడంతో బిజీగా ఉన్నా.. అని తెలపడం జరిగింది.