- ప్రభుత్వాలు మారినా పనులు ఆగొద్దు
- వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
అభివృద్ధి పనుల విషయాల్లో రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు ఆపొద్దని ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) సూచించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణకు కొంగుబంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్(KCR) రూ.250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయితే, ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారని, కాబట్టి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా పూర్తిచేయాలన్నారు.