- మరుగున పడ్డ మరుగుదొడ్లు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా..
- మరుగుదొడ్లు లేక, రోడ్ల మీదనే ఒంటికి, రెండుకి పోతున్న ప్రజలు..
గతంలో జిహెచ్ఎంసి మంచి సంకల్పంతో లక్షల రూపాయలు వేచించి ప్రజల సౌకర్యార్థం దాదాపు అన్ని డివిజన్లలో మరుగుదొడ్లను నామమాత్రాన, ఏ ఒక్క మరుగుదొడ్డికి నీటి సదుపాయం లేకుండా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో కొద్ది రోజులకే మరుగుదొడ్లల్లో ఉన్న లైట్లు, నల్లాలు, ఇతర పరికరాలన్నీ పోకిరిలు తమ చేతివాటం చూపి మరుగుదొడ్లను నిలువుగా దోచుకున్నారు. ఇవే మరుగుదొడ్లను ప్రతి ఏటా జిహెచ్ఎంసి అధికారులు స్వచ్ఛభారత్ స్వచ్ఛ, సర్వేక్షన్ సమయంలో సుందరంగా అలంకరించి, బ్లీచింగ్ చల్లి ముగ్గులు వేసి ఫోటోలకు ఫోజులిచ్చి స్వచ్ఛభారత్ బహుమతులు కూడా అందుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు ప్రజలకు బహిరంగంగా రోడ్ల పైన కాలకృత్యాలకు ఒంటికి, రెండు కి పోవడానికి ఒక అడ్డుగోడల ఉపయోగపడుతుంది తప్ప, ఈ మరుగుదొడ్లతో ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం లేకపోవడమే కాక, ఈ మరుగుదొడ్లతో చుట్టు ప్రాంతాలంతా దుర్వాసనతో, దోమల బెదడతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు తమ కష్టాన్ని చెమటను కార్చి వివిధ రూపాల్లో ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల డబ్బులతో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లు వల్ల లక్షల్లో ప్రజాధనం వృధా అయ్యింది. ఇంత జరుగుతున్నా మల్కాజిగిరి జిహెచ్ఎంసి అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు గాని మరుగుదొడ్లను మరమ్మతులు చేయించి, ప్రజలకు అందుబాటులో తేవాలని ఆలోచన లేకపోవడం విడ్డూరం. మరి ఇప్పటికైనా సామాన్య ప్రజలు పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసి అధికారులు మల్కాజిగిరి ప్రజలకు నూతన మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు.