- ‘గోవిందాకు’ గంత సపోర్టా.?
- ఎవరూ అవినీతి చేసినా పర్లేదు
- ఉన్నతాధికారుల అండ ఉంటే చాలు
- ఎంత దోచుకుంటే అంత మంచిది.!
- అలవొకగా ట్రాన్స్ ఫర్ చేసేస్తారు
- జీహెచ్ఎంసీలో అవినీతి జలగ రాజ్యం
- మలక్ పేట సర్కిల్ లో గోవింద రెడ్డి హవా
- శానిటరీ సూపర్ వైజర్ ఎన్ని స్కామ్ లు చేసిన చర్యలు శూన్యం
- జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్ట్
- డొల్లతనం బయటపడడంతో అక్కడ్నుంచి గోవిందా జంప్
- అవినీతి చేసినా సస్పెండ్ చేయని వైనం
- గలీజ్ గోవిందాను విధుల నుంచి తొలగించాలని డిమాండ్
రాష్ట్రంలో సర్కారు ఉద్యోగులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. నెల నెలా లక్షల్లో జీతాలు తీసుకుంటూ బల్లా కింద చెయ్యి పెట్టందే పని చేసేటట్టు లేరు. రూ.5వేల నుంచి మొదలు లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ)కి పట్టుబడడం నిత్యం చూస్తున్నాం. ఇంత చేసినా వారిని కాపాడే వారు లేకపోలేదు. జేబు కొట్టేసినా, తులం గోల్డ్ దొంగిలించిన వాడిని పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు పంపుతారు. కానీ కోట్లకు కోట్లు మింగిన అధికారిపై మాత్రం చర్యలుండవు. ఓ సినిమాలో రచయిత రాసిన డైలాగ్ “దొంగ, దొంగ అని అరుస్తుంటే.. నీ వెనుకాల ఉన్నది ఎవడో చూసుకో” అని ఆ దొంగవాడు చెప్పిన్నట్టుగా ఉంది. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టుగా వెనుకేసిన నల్ల డబ్బుతో ఆ కేసులు, అవినీతి మరకలను తుడిపేసుకుంటున్నారు. లేదంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద వ్యక్తులనో, రాజకీయ నాయకులనో పట్టుకొని ఫైరవీ చేపించి తెల్లారే తిరిగి ఉద్యోగంలో చేరిపోతున్నారు. ‘ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు’ అన్న చందంగా కొంతమంది ఉన్నతాధికారులైతే పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని ఈజీగా అక్కడ్నుంచి వేరే జాగకు ట్రాన్స్ ఫర్ చేసేస్తున్నారు. జీహెచ్ఎంసీ లో ఓ అవినీతి జలగ రాజ్యమేలుతున్నాడు. ఆయనకు అధికారుల అండ ఫుల్ గా ఉంది. ఎంత అవినీతికి పాల్పడ్డ ఆయనపై వేటు వేసేందుకు జంకుతున్నారు ఉన్నతాధికారులు. మరి లోపాయికారి ఒప్పందమో లేక మరేమైనా ఉన్నదో తెల్వదు. ఆయన మాతృ డిపార్ట్ మెంట్ మెడికల్ డిపార్ట్ మెంట్ అయినా జీహెచ్ఎంసీలో పెత్తనం చలాయిస్తున్నాడు. ఆయన చేసిన పాపాలు ఒక్కొక్కటిగా ఆదాబ్ బయటపెట్టడంతో ఎవరికీ పాలుపోలేదు. జలగలా ఆయన జనాన్ని పట్టిపీడిస్తుంటే అటు అధికారులు, ఇటు ప్రభుత్వం మీనమేశాలు లెక్కించడం శోచనీయం. జీహెచ్ఎంసీ శానిటరీ సూపర్ వైజర్ గోవిందా రెడ్డి ఎన్ని స్కామ్ లు చేసిన చర్యలు తీసుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆయన పూర్వ పలాలు చూస్తే… మలక్పేట్ సర్కిల్-6లో ఇంఛార్జ్ పోస్టులో కొలువు చేస్తూ ఒరిజినల్.. డ్యూబ్లికేట్, ట్రిబ్యుకేట్ చలాన్ల వ్యవహారంతో ఎన్ఫోర్స్మెంట్ చలాన్ జారీ ప్రక్రియలో ఓ భారీ స్కాం చేశారు. శానిటరీ విభాగంలో ప్రస్తుతం సూపర్ వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న పాశం గోవిందా రెడ్డి.. కొన్నాళ్ల క్రితం వరకూ అదే విభాగంలో ఇంఛార్జ్ అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్గా 3 సంవత్సరాల పాటు పనిచేశారు. శానిటరీ విభాగంలో అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్.. మీ సేవ ద్వారా ట్రేడ్ లైసెన్స్ను పొంది.. వారూ నిబంధనలను పాటించకపోతే వాటిని పునః పరిశీలిస్తారు. జీహెచ్ఎంసీ ఖజానాకు మాత్రం భారీ గండీ కొడుతున్నాడు. షాపుల యాజమానులు రూల్స్ ప్రకారం రుసుము కట్టకున్నా.. నిబంధనలకు పాతరేసినా అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్ చలాన్ల ద్వారా ఆ సొమ్మును వసూల్ చేస్తారు. అయితే ఇదే అదునుగా భావించి, షాప్ యాజమానులను భయబ్రాంతులకు గురి చేసి, అధిక మొత్తంలో ఎస్ఎఫ్టి ఉన్నా కూడా మీరు తక్కువ రుసుము చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారని, నిబంధనల ప్రకారం మీరు చెల్లించిన దానికంటే, ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగేవారు. ఈ వసూల్ కు గోవిందా రెడ్డి నియమించుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పంపించి, సెటిల్మెంట్ చేపించుకొని ఫోన్ పే ద్వారా డబ్బు పొందారు. తన అనుచరగణానికి కొంత మొత్తాన్ని ఇచ్చేవాడు. మిగిలిన సొమ్మును గోవిందా రెడ్డి, డిప్యూటి కమిషనర్లు జేబులు నింపుకునేవారు.
మలక్పేట సర్కిల్లో అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించిన గోవిందా రెడ్డి తన చేతివాటాన్ని ప్రదర్శించారు. ఒరిజినల్, డ్యూబ్లికేట్, ట్రిబ్లికేట్లలో గోల్మాల్కు తెర లేపి మూడేళ్లలో కోట్లు కొల్లగొట్టారు. వాస్తవానికి చలాన్ కట్టించుకునేటప్పుడు ఒరిజినల్ పేపర్ కింద కార్బన్ పేపర్ పెట్టాలి. అలాకాకుండా గోవిందా రెడ్డి షాపుల యాజమానుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ చలాన్ కట్టించుకునే సమయంలో వారికి నిర్ణీత మొత్తానికి సంబంధించిన రశీదునే ఇచ్చేవారు. పాశం గోవిందారెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డాడు. అతగాడు ముగ్గురు తాబేదార్లను పెట్టుకొని ట్రేడ్ లైసెన్స్ రీ వెరిఫికేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. జీహెచ్ఎంసీలో ట్రేడ్ లైసెన్స్ లు పొందాలంటే మీ సేవలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత సదరు షాపులు, హెూటల్స్, కాంప్లెక్స్ ల యాజమానులకు ట్రేడ్ లైసెన్స్ మంజూరవుతాయి. అయితే ఇలా మీ సేవా ద్వారా లైసెన్స్ పొందిన వారిలో ఎవరైనా నిబంధలను పాటించలేదని తేలితే.. ట్రేడ్ లైసెన్స్ ల రీ వెరిఫికేషన్కు అవకాశముంటుంది. ఈ రీ వెరిఫికేషన్ అనేది ఆయా షాపులు, హోటల్స్, కమర్షియల్ కాంపెక్స్ లు విస్తీర్ణం, అవి ఏ రహదారి పక్కనున్నాయి అనే అంశాలపై చలాన్లు రాస్తారు. అంతేకాదు.. గోవిందరెడ్డి అవినీతి లీలలు తవ్వినా కొద్ది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఆదాబ్ హైదరాబాద్ గోవిందారెడ్డి అవినీతి అక్రమాలపై ఆధారాలతో వరుస కథనాలు ప్రచురిస్తుంది. మలక్ పేట్ సర్కిల్- 6 జీహెచ్ఎంసీకి ఆందానీ తెచ్చే సర్కిల్స్ లో ప్రధానం. ఈ సర్కిల్లో సుదీర్ఘ కాలంగా శానిటరీ సూపర్ వైజర్ గా తిష్ఠవేసి కూర్చున్న న గోవిందారెడ్డి చెత్త చీపుర్లను కూడా వదల్లేదు. గోవిందా చెత్త చీపుర్ల సరఫరాలో తనదైన మార్క్ను చూపించారు. పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చేందుకు ఇవ్వాల్సిన చెత్త చీపుర్లను ఇవ్వకుండా వారినే స్వంతంగా తెచ్చుకోవాలని ఆర్డర్ చేశాడు. మలక్పేట సర్కిల్లో గోవిందారెడ్డి కోట్లు దండుకోవడం ఈ మొత్తం వ్యవహారానికి డిప్యూటి కమిషనర్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. శానీటరీ సూపర్వైజర్ గోవిందారెడ్డి చేసిన అవినీతి అక్రమాలు ఆధారాలతో సహా వెలుగులలోకి వచ్చాయి.. అలాంటప్పుడు గోవిందారెడ్డి మాతృ డిపార్ట్ మెంట్, మెడికల్ డిపార్ట్ మెంట్కు తిరిగి పంపించడం జరిగింది. కానీ, గోవిందారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవినీతి సొమ్మును ఎందుకు రీకవరీ చేయలేదు.. ఇందులో వారి హస్తం ఎంతవరకు ఉంది.. అనే ప్రశ్నలు సర్వత్ర ఉత్పన్నమవుతున్నాయి.. ఇప్పటికైనా గోవిందా రెడ్డిపై రెవెన్యూ రీకవరీ ఆక్ట్ ప్రకారం సొమ్మును రీకవరీ పరుచుకొని, విధుల నుండి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.