ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ను తొలగించిన హైడ్రా..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడించారు..అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు వెల్లడి కావడంతో కూల్చివేతలకు హైడ్రా ఆదేశాలు జారీ చేసింది.. హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్మెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.. కాగా తామే తొలగిస్తామని.. 30 రోజుల సమయం కావాలని హైకోర్టును కోరారు ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్మెన్షన్ ప్రతినిధులు. 30 రోజులు దాటినా వాటిని తొలగించక పోవడంతో గురువారం హైడ్రా నేరుగా రంగంలోకి దిగి కూల్చివేతలు నిర్వహించింది.