మొత్తం 18,180 మందికి రూ. 6వేల చొప్పున జమ
తెలంగాణలో ఉపాధి కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు జమ అయ్యాయి. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ అయ్యాయి. అయితే ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. కానీ.. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మంత్రి వినతిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించింది సర్కార్. 66,640 మంది కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ అయ్యాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.65 కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనుంది సర్కార్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్దదిక్కుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్థిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక సీజన్కు 6000 రూపాయలు చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తోంది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది.