- 5న ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు
- 8వ తేదీన అభ్యర్థుల భవితవ్యం
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. అన్ని రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. 70 అసెంబ్లీ స్థానాలకు రేపు (ఫిబ్రవరి 5న) పోలింగ్ జరగనుండగా.. 8వ తేదీన వారి భవితవ్యం తేలనుంది. అప్రమత్తమైన ఎన్నికల సంఘం ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది. మరోవైపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సంఘం ప్రకారం.. దిల్లీలో 1.56కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 13,766 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా.. ఇందులో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తెలుసుకునేందుకు క్యూ మేనేజిమెంట్ సిస్టమ్ అప్లికేషన్ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ముందస్తు పోలింగ్ సదుపాయం కల్పించగా.. ఇప్పటికే 7,980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15వేల మంది హోంగార్డులు, 35వేల మంది దిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 3వేల పోలింగ్ బూత్లను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జనవరి 7 నుంచి ఇప్పటివరకు 1049 కేసులు నమోదయ్యాయి. లక్ష లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడంతోపాటు 1353 మందిని అరెస్టు చేశారు. రూ.77కోట్ల విలువైన 196 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.