- అకాడమీ పనితీరుపై ఆరా తీసిన జూపల్లి కృష్ణారావు
బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో సంభాషించారు. శిక్షణ తరగతుల్లో చెబుతున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి చర్చించారు. అకాడమీలో భోజనం ఎలా ఉందని? నీటి సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలు, శిక్షణ తరగతులు, ఇతర అంశాల గురించి శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్స్ ను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీలను ఉద్దేశించి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని.. మీరంతా ఎంతో కష్టపడి, స్వయంకృషితో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమాజానికి మేలు చేసేలా సేవలు అందించాలని, అంకితభావంతో పని చేయాలని కోరారు. సమాజ శ్రేయస్సుకు మాదకద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, వాటి బారి నుంచి యువతను కాపాడేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, అబ్కారీ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఉన్నారు.