Friday, September 20, 2024
spot_img

రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..!

Must Read
  • ప్రభుత్వం రాగానే అభయ హస్తం దరఖాస్తులు
  • అన్ని ఆన్ లైన్ చేసినట్టు వెల్లడి
  • ఏడు నెలలైనా ఆ ఊసే లేదు
  • మరోసారి అప్లికేషన్ చేసుకోవాలని లీకులు
  • ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ రేషన్ కార్డు లింక్
  • తాజాగా రైతు రుణమాఫీకి సైతం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
  • తీవ్ర వ్యతిరేకత రావడంతో నిబంధన తొలగింపు
  • రేషన్ కార్డులో కొత్త నిబంధనలు అంటూ కాంగ్రెస్ జాప్యం
  • పదేండ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ లేదు
  • లక్షలాది మంది ఎదురుచూపులు

‘మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి’.. తెలంగాణకు పట్టిన దరిధ్రం పోవాలంటే చెయ్యి గుర్తుకు ఓటేయండి.. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు… డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇలాంటి పెద్ద డైలాగ్ లు కొట్టిర్రు కాంగ్రెస్ నేతలు. అవును నిజమోనేమో అని తెలంగాణ జనమంతా నమ్మి ఓటేసి హస్తం పార్టీని అందలం ఎక్కించిర్రు. ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నెగ్గి గద్దెక్కినంక కూడా.. మాదీ ప్రజా ప్రభుత్వం, ఇదీ ఇందిరమ్మ పాలన, గత పాలకుల లెక్క మా గవర్నమెంట్ ఉండదు.. ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతం అని ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఆరు పథకాల కోసం అభయ హస్తం పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. ఇందుకోసం లక్షలాది మంది ప్రజలు ఎగబడ్డారు. మాకు అదీ కావాలి, మాకు ఇదీ కావాలి అంటూ జనాలు వాటన్నింటికి అప్లై చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ పథకాల కోసం దాదాపు కోటిన్నరకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఆన్ లైన్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఒక్కరి డేటా సేవ్ చేయడం జరిగిందని వాటన్నింటినీ పరిశీలించి అర్హులను గుర్తించి పథకాలు అమలు చేస్తామని వెల్లడించింది.

పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు లేవు:

తెలంగాణను గత పదేళ్లు పాలించిన కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకతతోనే ఓటమి పాలయ్యారు. ప్రజలను ఘోసపుట్టించుకున్న ఆయనను కావాలనే ఫామ్ హౌజ్ కు పంపారు. ఇన్నాళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యకపోవడం దారుణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తప్పితే తెలంగాణ ఏర్పడ్డాక రేషన్ కార్డుల జారీ జరగలేదు. ఈ పదేళ్లల్లో ఎంతో మంది పుట్టారు.. మరెంతో మంది చనిపోయారు కూడా.. కొత్తగా పెళ్లై ముగ్గురు, నలుగురు పిల్లలను కన్నవారు సైతం లక్షల్లో ఉన్నారు. ఇంకా వారంతా అమ్మనాన్నల రేషన్ కార్డులోనే ఉండడం విడ్డూరంగా ఉంది. అమ్మాయిది వాళ్ల తల్లిగారింట్లో ఉంటే, అబ్బాయిది వాళ్ల అమ్మవాళ్లతో కలిపి ఉన్నప్పటికీ వాళ్లకు పుట్టిన పిల్లలూ మాత్రం అసలు రేషన్ కార్డులో పేరు, ఫోటో లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేస్తున్న గవర్నమెంట్ అసలు ఎంత మందికి రేషన్ కార్డులు లేవనే సోయి లేకపోవడం గమనార్హం. రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న పథకాలన్నింటికీ.. రేషన్ కార్డునే ప్రామాణికంగా చూస్తుండటంతో.. చాలా కుటుంబాలు ఆ పథకాల ఫలితాలు పొందలేకపోతున్నాయి. దీంతో.. ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తారా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఏడు నెలలైనా రేషన్ కార్డు ఊసేలేదు:

అభయ హస్తం దరఖాస్తుల్లోనే రేషన్ కార్డు కోసం అప్లికేషన్ తీసుకొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డు కోసం సుమారు కోటి మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో అప్లికేషన్ లు తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ ఏడే నెలలు కావస్తున్న ఇంత వరకు వాటి ఊసే లేకపోవడం సిగ్గుచేటు. మొన్న ఈ మధ్యలో మరోసారి రేషన్ కార్డు దరఖాస్తు అంటూ మీసేవా కేంద్రాల్లో చేసుకోవచ్చనే లీకులు చేశారు. ఇదివరకే అందరూ అప్లై చేసుకున్న పూర్తి డేటా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోవడం ఏంటనే విమర్శలు తలెత్తుతున్నాయి. అదిగో, ఇదిగో అంటూనే రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుంది. కొత్త నిబంధనలతో సరికొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ గప్ఫాలు కొడుతున్న హస్తం గవర్నమెంట్ ఇకనైన అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.

త్వరలో రేషన్ కార్డులు ఉత్తమ్ కొత్తపాట:

తెలంగాణలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అయితే.. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామని స్పష్టం చేశారు. వాస్తవానికి చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు అందించలేదు.. దీంతోపాటు కార్డుల్లో మార్పులు చేర్పులు ప్రక్రియ కూడా జరగలేదు.. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి జనం రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీకి హామీ ఇచ్చినప్పటికీ.. ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికీ ఇవ్వాలన్నదానిపై చర్చించి.. మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రేషన్ కార్డు వేరేగా.. ఆరోగ్యశ్రీ కార్డు వేరేగా ఇస్తామని వివరించారు. రేషన్ కార్డు అనేది నిత్యావసర సరుకుల కోసమని.. ఆరోగ్యశ్రీ కార్డు అనేది వైద్యం కోసమని ఉత్తమ్ పేర్కొన్నారు.

ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం.. గత డిసెంబర్ లో అభయ హస్తం దరఖాస్తుల్లో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This