- ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట..
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) తెలిపారు. సోమవారం హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పోరేషన్ (డీటీసీసీ) నూతన కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. “ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం. 200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏటీ సిటీని నిర్మించబోతున్నాం. అక్కడే ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ యూనివర్సిటీ నిర్వహణలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తాం. రాబోయే రోజుల్లో ఏఐ అంటే తెలంగాణా… హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా దాన్ని తీర్చి దిద్దుతాం” అని పేర్కొన్నారు. “రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. యువత కొత్తగా ఆలోచించి వీటికి పరిష్కారాలను నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. ఆ దిశగా కృషి చేసే వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం” అని హామీ ఇచ్చారు. “హైదరాబాద్ అనగానే అందరికీ కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలే గుర్తుకొస్తాయి. కానీ.. ఇక్కడ అన్ని రంగాలకు చెందిన కంపెనీలున్నాయి. 100 నుంచి 120 కంపెనీలు ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సేవలందిస్తున్నాయి. అన్ని రకాల పరిశ్రమలను స్థాపించేందుకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. మీకు కావాల్సిన నైపుణ్యమున్న మానవ వనరులను మేం అందిస్తాం. నిశ్చింతంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి” అని కోరారు. “డీటీసీసీ భారత్ లో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ సుమారు 500 మందికి కొత్తగా ఉపాధి దొరకబోతోంది. రాబోయే రోజుల్లో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటిలో అధిక శాతం తెలంగాణ యువతకు ఇవ్వాలని కోరగా అందుకు యాజమాన్యం అంగీకరించింది. అందుకు వారికి ధన్యవాదాలు” అని చెప్పారు. కార్యక్రమంలో డీటీసీసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రెనీ లారోకే మోరీస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లిన్ బిషప్ తదితరులు పాల్గొన్నారు.