- 5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం
- ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయం
- మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
వరుస దొంగతనాలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించే ఏడుగురు నిధితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 3న రాత్రి పూట ఏడుపాయల దేవస్థానం పరిసరాలలో పాపన్నపేట పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ ఆటోలో అనుమానాస్పదంగా కూర్చున్న కొందరు వ్యక్తులను గమనించారు. అది గమనించిన నిందితులు పారిపోవడానికి యత్నించగా వెంటనే పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించిన నిందితులు ఏడుపాయల దేవస్థానం పరిసరాలలో భక్తులు నిద్రిస్తున్న సమయంలో సత్రాలలోకి వెళ్లి బంగారు ఆభరణాలు దొంగిలించామని తెలిపారు. దీంతో పాపన్నపేట పోలీసులు వారిని అరెస్టు చేసి ఐదు దొంగతనం కేసులను చేసినట్లు తెలిపారు. వీరి నుంచి మొత్తం కలిపి 121 గ్రాములున్న ఐదు బంగారు మంగళ సూత్రాలను మరియు చోరీలో ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
కాగా ఈ కేసులో అరెస్టయిన నిందితులలో అందరూ సంగారెడ్డి రూరల్, హత్నూర, కౌడిపల్లి, కుల్చారం, శంకరం పేట, అల్లాదుర్గ్, కొండాపూర్, పుల్కల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు ఏడుగురు నిందితులు వడ్డే నాగయ్య రంగంపేట, మక్కని నవీన్ శివ్వంపేట, ఉప్పు సాయి కుమార్ శివ్వంపేట, మక్కని నరేష్ శివ్వంపేట, మక్కని పవన్ శివ్వంపేట, వడ్డే శ్రీకాంత్ శివ్వంపేట, వడ్డే నర్సింలు చిన్నఘనపూర్లను నిందితులుగా గుర్తించారు. కేసును విజయవంతంగా చేదించినందుకు మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ మరియు సిసిఎస్, ఐటీ సెల్ పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు.
ప్రజల భద్రతే తమ ధ్యేయం అని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఏడుపాయల దేవస్థానం వద్ద ఇటువంటి చోరీలు పునరావృతం కాకుండా స్థానికులు అనుమానితులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే దోపిడీలు తగ్గుతాయన్నారు. ప్రజల సహకారంతో, అన్ని సకల సమన్వయంతో ఏడుపాయల జాతరను విజయవంతం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐ రాజశేఖర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, సిసిఎస్ బృందం, ఐటీ సెల్ బృందం తదితరులు పాల్గొన్నారు.