- పోలీసులు తగిన రీతిలో బుద్ధి చెప్పిన, మారని దళారులు..
- అప్రతిష్ట పాలవుతున్న నర్సంపేట ఏఎల్ఓ కార్యాలయం..
- బ్రాంచ్ మీసేవలపై నజర్..
కార్మికుల సంక్షేమార్థం ఆర్థిక అభివృద్ధితో పాటు ఆర్థిక తోడ్బాటును అందించే విధంగా ఏర్పాటు చేసిన కార్మిక శాఖ కార్యాలయం అభాసుపాలవుతుంది. నర్సంపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ కార్యాలయంలో దళారులదే రాజ్యం అన్నచందంగా మారిపోయింది. లక్ష మంది లేబర్ కార్డు కలిగిన బాధితులు ఉన్నప్పటికీ నర్సంపేట లేబర్ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను కలిసే ప్రయత్నాలు జరగవు. నేరుగా దళారులే లేబర్ కార్డు హోల్డర్ ఇంటికి వెళ్లి మేము ఇలా చేస్తాం అలా చేస్తామంటూ నమ్మ పలికించి లేబర్ కార్డు హోల్డర్ గా వారిని చేర్పించి అన్ని తానే చూసుకుంటానని అభయమిస్తారు. ఆపై ఒకవేళ లేబర్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షల 30 వేలు, సహజ మరణం అయితే రూ. 1,30,000, వారి కుటుంబంలో కూతురు పెళ్లి జరిగితే రూ30,000 ఆ కూతురు ప్రసవిస్తే రూ.30,000 ఇలా కార్డు హోల్డర్కు కార్మిక శాఖ అందిస్తూ కార్మికుల ఆర్థిక తోడ్పాటుకు నిలుస్తుంది. లేబర్ కార్డు చేయించిన దళారులు ముందుగానే వాళ్లతో మాట్లాడి ఒకవేళ కూతురు పెళ్లి జరిగితే నువ్వు తిరగలేవు నీవల్ల కాదు నీకు డబ్బులు రావు డబ్బులు రావాలంటే నేనే ముందుండి చేయించాలి దానికి రిస్క్ ఎక్కువ అంటూ రూ.30 వేలల్లో రూ.15,000 తీసుకొని రూ.15,000 బాధితులకు అప్పగిస్తారు. లేబర్ అధికారికి ఇవ్వకుంటే ఫైల్ ముందుకు సాగదని తేల్చి చెప్తాడు. ఇదంతా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కు తెలిసినప్పటికీ కిమ్మనకుండా దళారులు చెప్పిందే విధంగా ఆయన ప్రవర్తన ఉంటుంది.
అదేవిధంగా లేబర్ కార్డు హోల్డర్ ప్రమాదవశాత్తు మరణిస్తే ఇటీవల బహిర్గతమైన విషయం ప్రకారం రూ.6 లక్షల 30 వేలు వస్తాయి అని తెలుసుకున్న సదరు దళారులు పాత బ్యాంకు అకౌంట్ని తీసేసి వీరికి పరిచయం ఉన్న బ్యాంకులో నామిని పేరా కొత్త బ్యాంకు ఖాతాను తెరిపించి ఏటీఎం కార్డు బ్యాంకు పాస్బుక్ అన్ని వారి వద్దనే ఉంచుకొని బాధితులకు లక్ష రూపాయలు ఇచ్చి రూ. 5 లక్షల 30 వేలు నొక్కేశారని విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారం 2024లో మే నెలలో సంఘం మండలంలో జరిగినట్లు నిర్ధారణ జరిగిందని తెలుస్తుంది. గత మూడేళ్ల క్రితం ఒక కోటి 50 లక్షల రూపా యలు పక్కదారి పట్టాయని దళారులు జేబులు నింపుకున్నారని అప్పటి పోలీస్ ఆఫీసర్లు క్షుణ్ణంగా విచారణ చేసి లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు సమస్యను పోనివ్వకుండా దళారుల వద్ద నుంచి డబ్బును వెనక్కి రప్పించి కొద్దిమంది బాధితులకు ఇప్పించినట్లు చర్చలు సాగుతున్నాయి.
ఆ క్రమంలోనే సదరు అప్పటి నర్సంపేట ఏఎల్ఓ మహమ్మద్ అలీపై నెక్కొండ నర్సంపేటలో కూడా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు అతిచాకచక్యంగా దళారులను అందరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మరొకమారు ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దళారుల వైఖరి మారకుండా మీసేవ సెంటర్ల ద్వారా బ్యాంకు అకౌంట్లను మారుస్తూ ఏటీఎం కార్డు బ్యాంకు పాసుబుకు లను దళారుల వద్ద ఉంచుకొని అక్రమానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నర్సంపేట ఏఎల్ఓ నుంచి డిసిఎల్ఓ వరకు ఇదే వ్యవహారం కొనసాగుతున్నట్లు చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. నర్సంపేట లేబర్ కార్యాలయంలో కార్డుదారుల సంఖ్య ఇప్పటివరకు విడుదలైన డబ్బులు బెనిఫిషరీస్ లిస్టు తీసుకుని సమగ్ర విచారణ చేస్తే దిమ్మతిరిగే అంశాలు బహిర్గతమవుతాయని పలువురు పలు రకా లుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడ్డ కార్మిక కార్యాలయంలో ఇలా పందికొక్కుల్లాగా దళారులు దూరి సంక్షేమ నిదిని వారి స్వార్థం కోసం వినియోగించడం ఇవి జిల్లాలో హల్చల్ జరిగినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు.
కలెక్టర్ వద్దకు చేరిన నివేదికలు :
నర్సంపేట లేబర్ కార్యాలయంలో జరుగు అవినీతిలపై నర్సంపేట మండల తాహసిల్దార్ రాజేష్ పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్ వద్దకు పంపించినట్లు తాహసిల్దార్ రాజేష్ తెలిపారు. అదేవిధంగా ఇటీవల లేబర్ కార్యాలయం చుట్టూ బెల్ట్ షాపుల వల్లే మీసేవ బ్రాంచీలు అనే ఆదాబ్ కథనంతో అధికారులు విచారణ చేపట్టారు. నర్సంపేటలో లేబర్ కార్యాలయం చుట్టూ మీ సేవలో బ్రాంచీలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకొని అక్రమార్జన ధ్యేయంగా నడుస్తున్న మీసేవ బ్రాంచ్ లపై సైతం కలెక్టర్ నివేదిక కోరగా తాహసిల్దార్ నివేదికను ఫోటోల రూపంలో పంపించినట్లు తాసిల్దార్ చెప్తున్నాడు. కాగా మీసేవ జిల్లా స్థాయి అధికారులు నర్సంపేట బ్రాంచ్ మీసేవలపై చర్యలు తీసుకోకపోవడం గమనార్వంగా ఉందని పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు.