- జనాభా పెంచడానికి ఇదొక్కటే మార్గం
- తమిళనాడు సిఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
లోక్సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో జనాభా ప్రాతిపిదికన చేపడితే నష్టపోతామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే.. రాష్ట్రంలో లోక్సభ స్థానాలు తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా మరోసారి స్పందించిన స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు. నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘నవ దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేనే చెప్పా. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోన్న వేళ ఇప్పుడలా చెప్పలేను. అంతకుముందు మేం కుటుంబనియంత్రణపై దృష్టిసారించాం. కానీ ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం. అందుకే నేను కోరుకునేది ఒక్కటే. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి‘ అని సీఎం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొళత్తూర్లోని ఓ వివాహ వేడుకలోనూ స్టాలిన్ ఇదేతరహా వ్యాఖ్యలు చేశారు. ‘పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టాం. కానీ, దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిరది‘ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 5న సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనాలంటూ ఎన్నికల సంఘం గుర్తింపుపొందిన రాష్ట్రంలోని 40కు పైగా పార్టీలకు ఆహ్వానం పంపారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను కేందప్రభుత్వం 2026లో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా ఇది జరిగితే రాష్టాన్రికి 8 నియోజకవర్గాల వరకు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.