Friday, September 20, 2024
spot_img

వణికిస్తున్న వైరల్‌ ఫీవర్‌

Must Read
  • తెలంగాణలో విజృంభిస్తున్నా సీజనల్‌ వ్యాధులు
  • ఒకే రోజు ఆరుగురు మృతి..
  • రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్‌
  • వైరల్‌ ఫీవర్స్‌,డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్‌,చికెన్‌ గున్యా వంటి సీజనల్‌ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు
  • ఇదే అదనుగా చేసుకుని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల దందా..
  • ప్రతి జ్వరాన్ని డెంగ్యూ అని చెప్తూ భారీగా వసూళ్లు
  • వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూన్న వైద్యులు

తెలంగాణలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.పల్లె నుండి పట్నం వరకు హాస్పిటల్స్‌ రోగులతో కిటకిటలాడుతున్నాయి.వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో వైరల్‌ ఫీవర్స్‌,డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్‌,చికెన్‌ గున్యా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రజలపై పంజా విసురుతున్నాయి.దింతో రోగులు ఆస్పత్రులవైపు పరుగులు పెడుతున్నారు.వైరల్‌ ఫీవర్లతో రాష్ట్రంలో వేర్వేరుచోట్ల ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో ఈడుపుగంటి సామ్రాజ్యం (67) అనే మహిళకు వారం కింద జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు.అక్కడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.అటు,ఇదే మండలం బ్రహ్మళకుంటకు చెందిన బానోతు కృష్ణ (50)కు వారం కింద ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో కల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు.రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.అలాగే, కామారెడ్డి సదాశివనగర్‌ మండలంలోని భూంపల్లికి చెందిన మనస్విని (11) కి జ్వరం రాగా కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ తరలించాలని వైద్యులు సూచించారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌ తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.అటు,ఇదే కామారెడ్డి సదాశివనగర్‌లో నరేశ్‌ (29) అనే వ్యక్తి డెంగీతో మృతి చెందాడు. కరీంనగర్‌ ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్‌ (26) జ్వరంతో ప్రాణాలు కోల్పోయాడు.ఇతను స్థానికంగా చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు.ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురి కాగా కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.మరోవైపు,మహబూబాబాద్‌ కొత్తగూడ మండలం హనుమాన్‌ తండాలో రాజేందర్‌,సంధ్య దంపతులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.ఈ దంపతులు కుమార్తెకు 5 రోజుల కిందటే జ్వరం వచ్చి తగ్గింది.స్వగ్రామంలో పని ఉందని కూతురితో కలిసి వెళ్తుండగా,దారిలో జ్వరం ఎక్కువై ఫిట్స్‌ వచ్చింది.ఈ క్రమంలోనే ఆమెను నర్సంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైరల్‌ ఫీవర్స్‌,డెంగీ జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రతి జ్వరాన్ని డెంగీ అని చెప్పి చికిత్స కోసం భారీగా వసూలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.డెంగీ ఉదయం పూట కుట్టే ఏడిస్‌ దోమల ద్వారా వ్యాపించే ఓ సాధారణ జ్వరం.ఇది కార్పో వైరస్‌ ద్వారా వ్యాప్తి చెందుతుంది.తీవ్ర జ్వరం,తలనొప్పి,కంటి లోపలి భాగం నొప్పి,వాంతులు, విరేచనాలు,కండరాలు,కీళ్లనొప్పులు,చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి.ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య తగ్గుతుంది.అవి 20 వేలకు తగ్గినా ఇబ్బంది ఉండదు.తిరిగి అవే వృద్ధి చెందుతాయి.ప్రస్తుత సీజన్‌లో జ్వరాలతో ఎక్కువ మంది ఆస్పత్రులకు వస్తున్నారు.మరికొందరు నిర్లక్ష్యంతో సొంత వైద్యం చేసుకుంటున్నారు.అలా కాకుండా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This