Friday, September 20, 2024
spot_img

నీటి కాలుష్యం – వ్యాధి కారకం

Must Read

భారతదేశంలో సగటు వర్షపాతాన్ని గమనిస్తే, ఆగష్టు నెల ప్రథమంగా నిలుస్తుంది. ఈ నెలలో సాధారణంగా జూన్, జూలై, మరియు సెప్టెంబర్ నెలలతో పోలిస్తే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.ఈ వర్షపాతం స్థాయులు వివిధ ప్రాంతాల్లో వేరుగా ఉండవచ్చు, కానీ సగటు గణాంకాలు దేశవ్యాప్తంగా చూస్తే, మన దేశంలో వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమయి, సాధారణంగా వర్షపాతం సుమారు 20-25% నమోదు అవుతుంది. జూలై నెలలో వర్షాలు కొంత మేర పెరుగుతాయి, సాధారణంగా ఈ నెలలో మొత్తం వర్షపాతం సుమారు 30-35% వరకు ఉంటుంది.ఆగస్టు నెలలో వర్షపాతం అత్యధికంగా ఉంటుంది, మొత్తం వర్షపాతం సుమారు 35-40% వరకు ఈ నెలలో నమోదవుతుంది. ఈ నెలలో వర్షాల తీవ్రత ఇంకొంత ఎక్కువగా ఉంటుంది.సెప్టెంబర్ నెలలో వర్షాలు తగ్గుముఖం పడతాయి,మొత్తం వర్షపాతం సుమారు 15-20% మాత్రమే ఉంటుంది.ఆగస్టు నెలలో వర్షపాతం ఇతర నెలల తో పోలిస్తే అధికంగా ఉంటుంది.వర్షపాతం ఎక్కువగా ఉండటం వలన ఈ నెలలో నీటి కాలుష్యం వల్ల వర్షాకాలం సంబంధిత వ్యాధులు మరింత విజృంభిస్తాయి.

ఈ సమయంలో వర్షాలు పడి,ప్రకృతిని అందంగా,పచ్చగా మార్చేస్తాయి.కానీ,ఈ కాలంలో సహజంగా ఏర్పడే నీటి కాలుష్యం వల్ల పర్యావరణ సమస్యలు,ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.వర్షాకాలంలో వాన నీటి కాలుష్యంతో పాటు అనేక వ్యాధులు ప్రబలతాయి,వాటి ఉధృతికి అనేక అంశాలు కారణంగా ఉంటాయి.భారీ వర్షాలు పడటంతో మురుగు కాలువలు, పారిశ్రామిక వ్యర్థాలు,వ్యవసాయ రసాయనాలు నేరుగా భూగర్భ నీటిలో కలుస్తాయి. వర్షపు నీరు పైభాగంలో ఉన్న మురుగు, చెత్త, మరియు ఇతర హానికర పదార్ధాలను తీసుకువెళ్ళి నీటికి కలిపి నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇది ప్రధానంగా ప్రజల తాగు నీటిని ప్రమాదకరంగా మారుస్తుంది.
జల-సంబంధిత వ్యాధులు ముఖ్యంగా ఈ కాలంలో విస్తారంగా వ్యాపిస్తాయి. ఈ వ్యాధులు కాలుష్యపూరిత నీటి కారణంగా లేదా కాలుష్యమైన నీటిలో నివసించే సూక్ష్మజీవులు, వానకాలంలో వృద్ధి చెందే బాక్టీరియా,వైరస్ ల వలన వ్యాపిస్తాయి.ప్రధాన వ్యాధులు డయేరియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, మరియు హేపటైటిస్ A, E.ఇవి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి, అయితే చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఎక్కువగా ప్రమాదం కలగజేస్తాయి.వర్షా కాలంలో పారిశ్రామిక మురుగు,వ్యవసాయ వ్యర్థాలు భూగర్భ నీటిలో కలిసే ప్రమాదం ఎక్కువవుతుంది. ఇది ప్రజలకు సురక్షిత తాగునీటి అందుబాటు ను తగ్గిస్తుంది. అదేవిధంగా, పేద మరియు మారుమూల ప్రాంతాల్లో వర్షాకాలంలో పారిశుద్ధ్యం సమస్యల కారణంగా కాలుష్య పూరిత నీటిని తాగడం సాధారణమవుతుంది.ఇది ప్రజలు అనేక అనారోగ్యాల పాలిట పడడానికి దారితీస్తుంది.వర్షాకాలంలో ప్రతీ సంవత్సరం సుమారు 38% డయేరియా కేసులు నమోదవుతాయి. ఈ వ్యాధి ప్రధానంగా కాలుష్యపూరిత నీరు,మరియు సురక్షిత పారిశుద్ధ్య సదుపాయాల లేమి కారణంగా వస్తుంది. డయేరియా కేసులు ముఖ్యంగా ఆగస్టు నెలలో పెరుగుతాయి,చిన్నపిల్లల్లో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. మలేరియా, వర్షాకాలంలో అత్యంత ప్రబలంగా వ్యాపించే వ్యాధి. వర్షాలు పడటం వల్ల నిల్వ నీటిలో దోమల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది,ఇది మలేరియా వ్యాప్తికి ప్రధాన కారణం. భారతదేశంలో వర్షాకాలంలో సుమారు 25-30% మలేరియా కేసులు నమోదు అవుతాయి. మలేరియా వ్యాధి “అనోఫిలిస్” అనే దోమలు కుట్టడం వలన వ్యాపిస్తుంది.

డెంగ్యూ కూడా వర్షాకాలంలో విస్తృతంగా వ్యాప్తి చెందే వ్యాధి. వర్షాలతో నిల్వ ఉన్న నీరు డెంగ్యూ వ్యాప్తికి ప్రధాన కేంద్రం అవుతుంది. ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో మరియు అభివృద్ధి చెందని ప్రాంతాల్లో మరింత ఉధృతంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి “ఏడిస్ ఈజిప్టై” అనే దోమలు కుట్టడం వలన వ్యాపిస్తుంది.టైఫాయిడ్ కూడా ఈ కాలంలో ఎక్కువగా నమోదవుతుంది. వర్షాల కారణంగా నీటి కాలుష్యం తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు కాలుష్య పూరిత నీటిని తాగి ఈ వ్యాధికి గురవుతారు. టైఫాయిడ్ వ్యాధి సాల్మోనెల్లా టైఫి బ్యాక్టీరియాతో కలుషితమైన నీరు మరియు ఆహారం వలన వ్యాపిస్తుంది. హేపటైటిస్ A మరియు E ప్రధానంగా కాలుష్యపూరిత నీరు లేదా ఆహార పదార్ధాల ద్వారా వ్యాపిస్తాయి. వర్షాకాలంలో ఈ వ్యాధులు ఎక్కువగా విస్తరిస్తాయి.హేపటైటిస్ A మరియు E వైరస్లు కాలుష్యపూరిత నీటిలో మరియు శుభ్రత లేకపోవడం వలన వ్యాపిస్తాయి.

భారతదేశంలో, డయేరియా కేసులు ఆగస్టు నెలలో సుమారు 40% వరకు పెరుగుతాయి. మార్చి నుంచి జూన్ మధ్య కాలంతో పోలిస్తే, ఆగస్టు నెలలో ఈ వ్యాధి ఉధృతి దాదాపు 2-3 రెట్లు అధికంగా ఉంటుంది.మలేరియా కేసులు ఆగస్టు నెలలో అత్యధికంగా నమోదవుతాయి. జూలై నెలలోని కేసులతో పోలిస్తే ఆగస్టులో మలేరియా కేసులు సుమారు 30% ఎక్కువగా ఉంటాయి. మార్చి నుండి జూన్ వరకు నమోదైన కేసులతో పోలిస్తే ఆగస్టు నెలలో మలేరియా కేసులు సుమారు 4 రెట్లు పెరుగుతాయి.డెంగ్యూ కేసులు ఆగస్టు నెలలో అత్యధికంగా నమోదు అవుతాయి. ఈ నెలలో నమోదయ్యే కేసులు జూన్ నెలలో నమోదు అయ్యే కేసులతో పోలిస్తే సుమారు 50% అధికంగా ఉంటాయి.టైఫాయిడ్ కేసులు ఆగస్టు నెలలో మిగతా నెలలతో పోలిస్తే సుమారు 25% అధికంగా నమోదవుతాయి. వర్షాకాలంలో నమోదయ్యే మొత్తం టైఫాయిడ్ కేసుల్లో 35-40% ఈ నెలలోనే వుంటాయి.హేపటైటిస్ A మరియు E కేసులు ఆగస్టు నెలలో ఇతర నెలలతో పోలిస్తే సుమారు 30% ఎక్కువగా నమోదు అవుతాయి.

ఈ వ్యాధులు ఆగస్టు నెలలో వ్యాధుల తీవ్రతను మరియు విజృంభణను స్పష్టంగా చూపిస్తాయి.నీటి శుద్ధి అనేది వ్యాధులను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో నీటిని మరగబెట్టడం, లేదా ఫిల్టర్ల తో శుద్ధి చేసి తాగడం మంచిది. అదేవిధంగా, రసాయనాలు మరియు ఇతర హానికర పదార్ధాలు నీటిలో కలిసే అవకాశాన్ని తగ్గించడం కోసం చర్యలు తీసుకోవాలి.
పరిసరాల పరిశుభ్రత అనేది వర్షాకాలంలో వ్యాధుల నివారణకు అవసరం. పారిశుధ్యం లేకపోవడం వలన వర్షాకాలంలో నీరు కాలుష్యం కావడం సాధారణం. ప్రజలకు వ్యాధుల గురించిన అవగాహన కల్పించి,తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ప్రభుత్వం వర్షాకాలంలో నీటి కాలుష్యాన్ని నియంత్రించడం కోసం చర్యలు తీసుకోవాలి.ప్రత్యేకంగా మురుగు నిర్వహణ,పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ మరియు నీటి సరఫరా పరిశుభ్రత పై దృష్టి పెట్టాలి.వర్షాకాలంలో,ముఖ్యంగా ఆగస్టు నెలలో,నీటి కాలుష్యం మరియు వాననీటి కారణంగా అనేక వ్యాధులు విస్తరిస్తాయి.ఈ సమస్యను పరిష్కరించడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. పారిశుధ్యం, నీటి శుద్ధి,మరియు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ వ్యాధులను నివారించవచ్చు.వర్షాకాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం,తద్వారా నీటి కాలుష్యం వల్ల కలిగే వ్యాధులను తగ్గించవచ్చు.

డా: చిట్యాల రవీందర్
7798891795

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This