Friday, September 20, 2024
spot_img

ఉపాధ్యాయ శిక్షణ కళాశాల లలో ఉపాధ్యాయులేరి ?

Must Read

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలైన (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ),(బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్)లలో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ఆచార్యులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రాథమిక విద్యా విద్యార్థి జీవితంలో పునాదిగా భావిస్తారు.ప్రాథమిక పాఠశాలలలో బోధించడానికి ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్ పాఠశాలలలో నియమిస్తారు.ఎస్జీటి ఉపాధ్యాయులు కావడానికి గతంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డి.ఎడ్), బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బి.ఎడ్) వారిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డి.ఎస్సీ) ద్వారా ఎంపిక చేసేవారు.ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు మరియు మనదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయులను ఇంటర్మీడియట్ పూర్తైన తర్వాత చేసే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డి.ఎడ్) వారు మాత్రమే అర్హులని, డిగ్రీ తర్వాత చేసే బి.ఎడ్ వారు అనర్హులని ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాథమిక పాఠశాలలలో బోధించడానికి అర్హత కలిగిన డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డి.ఎడ్) కళాశాలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 7 మంది మాత్రమే ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఉన్నట్లు చెబుతున్నారు.కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల చేత, స్కూల్ అసిస్టెంట్ లను డిఫిటేషన్ మీద తీసుకుంటున్నారు.వారు డిపిటేషన్ మీద ఉన్న ఉపాధ్యాయులు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డి.ఎడ్) శిక్షణ తీసుకుంటున్న ఛాత్రోపాధ్యాయులకు సరైన శిక్షణ, మార్గదర్శకం దొరకడం లేదు. ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ తరగతులు, ఫీల్డ్ వర్క్ ఎంతో ముఖ్యమైనది.ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న ఛాత్రోపాధ్యాయులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఎవరు ఉండకపోవడం వల్ల ఉపాధ్యాయ శిక్షణ నామమాత్రపు గా మారింది.

డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డి.ఎడ్) కళాశాలల్లో ఉపాధ్యాయులను ఎంపిక చేయడానికి పాఠశాలల్లో గత 25,26 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు ఎం.ఏ లు ,ఎం.హెడ్లు, పిహెచ్.డి లు చేసిన వారు ఉన్నారు.వారికి పదోన్నతులు ఇవ్వడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్థికంగా ఎక్కువ బరువు పడదు.అనుభవం కలిగిన సీనియర్ ఉపాధ్యాయుల వేతనాలు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డి.ఎడ్) కళాశాలల్లో ఉపాధ్యాయుల వేతనాలతో దాదాపు సమానంగా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖాధికారులు తెలంగాణ రాష్ట్రంలోని విద్యకు, వైద్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖ ను ఎవరికి కేటాయించకుండా స్వయంగా తామే నిర్వహిస్తూ విద్యా శాఖ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక గత ఆరు, ఏడు సంవత్సరాల నుండి బదిలీలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా బదిలీలు, పదోన్నతులు పూర్తి చేశారు.గత మూడు దశాబ్దాలుగా ఉన్నత పాఠశాలలలో పనిచేస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటూ శ్రమదోపిడికి, వెట్టిచాకిరికి గురైన భాష ( తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ) మిగతా దేశీయ భాషలను బోధించే భాష పండితులకు పదోన్నతులు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ ( భాష లుగా) బదిలీలు చేశారు.గత ప్రభుత్వం భాష పండితులకు పదోన్నతులు ఇస్తామని జీ.వో 2,3,16,17,110 లు తీసుకొని వచ్చారే గాని అమలు చేసిన పాపాన పోలేదు.ఉపాధ్యాయ శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల సమయంలో జీ.వో లు తేవడం ఎన్నికల్లో భాష పండితుల ఓట్లు అనుకూలంగా వచ్చేటట్లు చూసి తర్వాత అటుకు ఎక్కించడం అలవాటు గా మారింది.ప్రపంచ తెలుగు మహాసభలలో భాష పండితులకు పదోన్నతులు కల్పిస్తామని చిన్న చిన్న కోర్టు కేసులను పరిష్కరించి విలైనంత త్వరగా పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ప్రపంచ తెలుగు ప్రతినిధుల సాక్షిగా హామీ ఇచ్చి ఆరు సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోలేదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారడం రాష్ట్ర ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించగానే కోర్టు కేసులను పరిష్కరించి ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేస్తామని చెప్పారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు లోనూ, మనదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లోనూ కేసులలో కౌంటర్ దాఖలు చేపించి అన్ని సమస్యలను పరిష్కరించి ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా 33 జిల్లాలలో అన్ని కేడర్ ల ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు గాని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ( డైట్) కళాశాలల్లో ఉపాధ్యాయుల, ఉపన్యాసకుల ( లెక్చరర్, సీనియర్ లెక్చరర్) పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు, ఉపాధ్యాయ, విద్యార్థుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నారు.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,
 9290826988
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This