కేసీఆర్ దేవుడన్న కవిత వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చుట్టూ దయ్యాలున్న వ్యక్తి దేవుడెలా అవుతారని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పిన కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారని జూపల్లి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. గత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే 6 గ్యారంటీలనూ అమలుచేస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు.
కాంగ్రెస్ పాలన చూస్తుంటే దుఃఖం వస్తోందని కేసీఆర్ అన్నారు గానీ వాస్తవానికి అధికారం దూరమైనందుకు ఆయనకు దుఃఖం వస్తోందా? లేక, కవిత చెప్పినట్లు చుట్టూ ఉన్న దయ్యాలను చూసి దుఃఖం వస్తోందా అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని జూపల్లి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని, నిజాలను గ్రహించాలని కోరారు. దేశానికైనా, రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.