ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్లో సీఎం రేవంత్ పేరు వచ్చినందున ఆయన రాజీనామా చెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులోని అంశాలు.. ఈడీ చార్జ్షీట్ ప్రకారం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా సంస్థకు విరాళాల పేరుతో కోట్లాది రూపాయలు సేకరించారు. తద్వారా రాజకీయ పదవుల కోసం క్విడ్ ప్రొ కో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఆరోపణలు అవినీతి నిరోధక చట్టం 1988 కిందికి వస్తాయి. ఇది చట్టపరమైన అంశం మాత్రమే కాదు. రాజ్యాంగ నైతికతను కూడా ఉల్లంఘిస్తోంది.
రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ పార్టీ నేత మాత్రమే కాకుండా సీఎం పదవిలో ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు ప్రభుత్వంపై నెగెటివ్ ప్రభావం చూపుతాయి. కాబట్టి సీఎం పదవి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన రాజీనామా చేయాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎం ప్రవర్తన ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే గవర్నర్ చర్య తీసుకోవచ్చు. కేబినెట్ సమష్టి బాధ్యతకు లోబడి ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
మన దేశ పార్లమెంటరీ వ్యవస్థలో నైతిక ప్రవర్తన చట్టపరమైన అంశాల కన్నా ముఖ్యం. సీఎం పదవిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే అవి ప్రభుత్వ నైతికతను దెబ్బతీస్తాయి. అందువల్ల రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి. గతంలో జాతీయ స్థాయిలో ఇలాంటి పరిస్థితుల్లో పదవుల నుంచి తప్పుకున్న పలువురు నేతల పేర్లను ఉదహరించారు.
రేవంత్ పేరు ఈ కేసులో కేవలం ప్రస్తావనకు మాత్రమే రాలేదు. ఆయన ప్రధాన పాత్రధారి. కాంగ్రెస్, బీజేపీ నాయకులూ ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేశారు. రేవంత్ సైతం అదే నైతిక బాధ్యతను తీసుకోవాలి.
రేవంత్ సీఎం పదవిలో కొనసాగడం వల్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా సీఎం పదవిని అపవిత్రం చేస్తుంది. గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. రేవంతే స్వయంగా రాజీనామా చేసి న్యాయ ప్రక్రియకు సహకరించాలి.
తెలంగాణ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి.