- ఇక డబుల్ ఇంజిన్ సర్కార్కు రంగం సిద్దం
- ఆప్ను ఊడ్చి పారేసిన రాజధాని ఢిల్లీ ప్రజలు
- జైలుకెళ్లిన ఆప్ నేతలంతా ఓటమి
- పర్వేశ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం
- చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి
- ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరవాత బిజెపి అక్కడ అధికారం చేపట్టబోతోంది. అవినతిని ఊడ్చేస్తానంటూ గద్దెనెక్కిన ఆప్ను ప్రజలు ఊడ్చి అవతల పడేశారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికలకు సంబంధించి శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది. 70 సీట్లకు గాను బిజెపి మ్యాజిక్ ఫిగర్ను దాటి 47 సీట్లలో ఆధిక్యం ప్రదర్శించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కౌంటింగ్లో కనిపించాయి. కాంగ్రెస్ ఎక్కడా ఖాతా తెరవలేదు. పోటీ బిజెపి, ఆప్ మద్యే జరిగినట్లు ఫలితాలు వెల్లడించాయి. మొత్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతోంది. ఫలితాలపై బిజెపి హర్షం వ్యక్తం చేయగా, ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇకపోతే ఫలితాల తీరును గమనిస్తే.. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆప్ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సోమనాథ్ భారతి వంటి కీలక నేతలు ఓడిపోయారు. లిక్కర్ స్కామ్లో జైలుకెళ్లిని కేజీవ్రాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ ఓడిపోవడం గమనార్హం. సాధారణంగా జైలుకు వెళ్లి వచ్చిన ఏ నాయకుడికైనా సానుభూతి వస్తుంది, అయితే ఢిల్లీ ఓటర్లు మాత్రం లిక్కర్ స్కామ్లో వీరి హస్తం ఉందని భావించినట్లు ఉన్నారు. అందుకే ముగ్గురిని కూడా చావుదెబ్బ తీశారు. తనను కావాలనే బీజేపీ టార్గెట్ చేస్తోందని కేజీవ్రాల్ పదేపదే ఆరోపించినప్పటికీ ఢిల్లీ ఓటర్లు నమ్మలేదు. లిక్కర్ స్కామ్కి తోడు శీష్ మహల్, ప్రభుత్వ వ్యతిరేకత, మధ్య తరగతి వర్గాలు బీజేపీ వైపు వెళ్లడం ఇవన్నీ ఆప్ ఓటమికి కారణమని చెప్పవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ని విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఈ కేసులో ఆప్ నేతల్ని అరెస్ట్ చేశారు. బెయిల్పై బయటకు వచ్చిన కేజీవ్రాల్ తన పదవికి రాజీనామా చేసి, అతిశీ మార్లెనాకు ఢిల్లీ పగ్గాలు అప్పగించి, అనధికార సీఎంగా పనిచేశారనే వాదనలు ఉన్నాయి. అయితే, తన నిజాయితీని ఢిల్లీ ప్రజలు నమ్ముతారని, మళ్లీ తననే అధికారంలోకి తీసుకువస్తారని కేజీవ్రాల్ భావించారు. తన నిజాయితీకి అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం అని, తనను కాపాడే బాధ్యత ఢిల్లీ ఓటర్లదే అని సెంటిమెంట్ కామెంట్స్ చేశారు. అయినా కూడా జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు నేతలకు ఓటమి తప్పలేదు. ఇకపోతే కేజ్రీవాల్ను మాజీ సిఎం సాహిబ్సింగ్ వర్మ కుమారుడు బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఓడించి సంచలనం సృష్టించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీ ఓటర్లు భాజపాకు పట్టం కట్టారు. ఘన విజయాన్ని అందించారు. కమలదళం హోరులో.. గత మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకుపోయింది. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటి 43 స్థానాల్లో విజయం సాధించింది. మరో 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే 48 స్థానాల్లో కమలం హవా కనబర్చింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలకు భాజపా గండికొట్టింది. అంతేకాదు.. ఆప్ అధినేత కేజీవ్రాల్ సహా పలువురు పార్టీ పెద్దలకూ ఓటమి తప్పలేదు.