- ప్రభుత్వ కళాశాలలకు స్టేట్ర్యాంకులు ఎందుకు రావడం లేదు
- స్టేట్ర్యాంకుల వెనుక మతలబు ఏమిటి…?
- ఒక్కసమాధానం కూడా తప్పుపోకుండా ఎలా రాస్తున్నారు?
- అసలు సూత్రధారులు ప్రభుత్వాధికారులేనా…?
- ఎవరూ ఊహించని కొత్తదందాకు తెర
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంటర్పరీక్షల సమయంలో నిరంతర ప్రక్రియ
- పరీక్షకు 10నిమిషాల ముందే ప్రశ్నలు లీక్చేస్తుంది ఎవరు
- భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపక బృందం ఎంతో మంది ఉన్నారు. ఎంతో అనుభవం ఉండి ఓపికతో సబ్జెక్టులను బోధించే అధ్యాపకులు ఉన్నా ప్రభుత్వం కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం స్టేట్ ర్యాంకులు రావు. కాని ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే స్టేట్ ర్యాంకులు వస్తాయి. 1నుండి 10 వరకు ర్యాంకుల పరంపరం కొనసాగించడం వెనుక అసలు కారణం ఏంటని, ప్రైవేట్ కళాశాలలకే ర్యాంకులు ఎలా వస్తున్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాలల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఎంత స్టేట్ర్యాంకు విద్యార్థినీ అయినా సరే ఒక్కసమాధానం కూడా తప్పుపోకుండా ఎలా రాస్తున్నారు. ఈ విషయాలను లోతుగా ఆలోచిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా ఎక్కడో ఒకచోట తప్పులు పోవడం సహజం. కాని స్టేట్ర్యాంకర్ల సమాధాన పత్రాలు చూస్తే ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఎలా ఉంటున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక అసలు సూత్రదారులు ఎవరు? ప్రభుత్వాధికారులేనా లేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ముడుపుల మాయలో పడి ఈ నయాదందాకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
మార్చి 5నుంచి ఇంటర్ పరీక్షలు…
మార్చి 5నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలకే ప్రతీ సంవత్సరం స్టేట్ ర్యాంకులు ఎలా వస్తున్నాయంటూ ప్రభుత్వకళాశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు స్టేట్ర్యాంకులు ఎందుకు రావడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 146 ప్రభుత్వ కళాశాలలు, 87 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటికోసం ఖమ్మంలో 72, భద్రాద్రి కొత్తగూడెంలో 36పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 27,048విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 28,880 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
కొత్తదందాలో లీకేజీలకు తెర…
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పరీక్షలకు పదినిమిషాల ముందే రెండు మార్కులకు సంబంధించిన పది ప్రశ్నల సమాధానాలు ముందుగానే ఆయా కాలేజీల్లో చదివే మెరిట్ విద్యార్థులకు చరవాణి ద్వారా సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రైవేట్ కాలేజీలకు ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగాప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు సమాధానాలు తెలియక వారికి ర్యాంకులు రావడం లేదు.
ర్యాంకులు సాధించేవారే లక్ష్యంగా…
కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 460కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులను టాపర్స్గా నిలబెట్టేందుకు కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఈ రకమైన దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ర్యాంకులే లక్ష్యంగా పరీక్షా సమయం కంటే ముందుగానే ప్రశ్నలు లీక్ చేయడంతో వెంటనే ఆయా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చరవాణి ద్వారా సదరు విద్యార్థులకు వాటి సమాధానాలు తెలియచేస్తూ ఖచ్చితంగా అవి రాయాలని చెప్పడంతో వారు ఆ సమాధానాలు రాసి టాపర్స్గా నిలుస్తున్నారు. ఈ కొత్తరకమైన దందాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు అడ్డుకట్ట వేయాలని ఇందులో ఏస్థాయి అధికారి అయినా భాగస్వామి అయి ఉంటే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రశ్నలు లీక్చేస్తే శాఖాపరమైన చర్యలు…
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులు
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రైవేట్ కళాశాలల్లో రెండు మార్కులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు లీక్ చేస్తున్నారని ఆరోపణలపై ఆదాబ్ హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులు హెచ్. వెంకటేశ్వ రరావు, రవిబాబులను వివరణ కోరగా… ప్రతి ప్రైవేట్ కళాశాలల్లో సిసి కెమెరాల నిఘా ఏర్పాటు,సెల్ఫోన్ల అనుమతి లేదని, అదే విధంగా ఒక వేళ సమాధానాలు లీక్ చేస్తే సంబం ధిత ఆయా కళాశాలలకు సంబంధించిన సిఎస్ఓలు, డిఓలు బాధ్యతలు వహించాలని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.