బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. BRSను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆమె ఇవాళ (2025 మే 29న) మీడియాతో చిట్ చాట్ చేశారు.
తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోవట్లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనను కేసీఆర్ నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని, అయితే అది ఎవరివల్లా కాదని తేల్చిచెప్పారు. పార్టీని సరిగా నడపట్లేదని, ప్రతిపక్షంపై ట్వీట్లకే పరిమితమవుతున్నారని తప్పుపట్టారు. కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే గ్రామ స్థాయి నుంచి పోరాటం చేయకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. కేసీఆర్ తప్ప ఎవరినీ తనకు నాయకుడిగా పరిగణించబోనని కుండబద్ధలు కొట్టారు. తనను రేవంత్ కోవర్టుగా పేర్కొనటం సరికాదని, తాను కాంగ్రెస్ పార్టీలోకీ పోనని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నౌక అని, అలాంటి పార్టీలోకి ఎందుకు వెళతానని ప్రశ్నించారు.
ఎంపీ ఎన్నికల్లో తనను బీఆర్ఎస్ పార్టీవాళ్లే ఓడించారని ఆరోపించారు. మద్యం కేసులో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని కవిత తెలిపారు. తాను కేసీఆర్కి ఇప్పటివరకు ఎన్నో లేఖలు రాశానని, లేఖను చదివిన అనంతరం ప్రతిసారీ కేసీఆర్ చించివేసేవారని చెప్పారు. ఇప్పుడెందుకు, ఎవరు తన లేఖను లీక్ చేశారో చెప్పాలని కోరారు.