దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకులు
తెలుగు భాషకే వన్నెతెచ్చిన పద్యం ద్వారా తెలుగు భాషలో పట్టు, భాషా సౌందర్యం, జీవన విలువల బోధన, భాషపై మక్కువ లాంటివి అనుభవంలోకి వస్తాయని తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్యం సేనాధిపతి అన్నారు. నాగేశ్వర డిగ్రీ, పిజీ కళాశాల సమావేశ మందిరంలో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం కరీంనగరం శాఖ నిర్వహించిన తెలుగు పద్య పఠన పోటీల బహుమతి ప్రదానోత్సవంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ తెలుగు పద్యాలను నేటి పిల్లలకు పరిచయం చేయాలని, మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరారు.
సమావేశ అధ్యక్షులు డా బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆంగ్ల మాద్యమ వరదలో తెలుగు కొట్టుకుపోతున్నదని, రేపటి తరానికి తెలుగు భాష పట్ల ఆదరణ తగ్గుతోందని, తెలుగు భాషలో పద్యాలను నేర్పడం ద్వారా పిల్లలకు భాష పట్లు అభిరుచి పారుతుందని అన్నారు. మాతృభాష తెలుగుతో పాటు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఆంగ్లం తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. తెలుగు మాట్లాడితే అవమానకరం అనే భావనలు తొలగిన నాడే మన మాతృభాషకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. న్యాయ నిర్ణేతలు అన్నాడి గదేందర్ రెడ్డి, పండితులు రామ్మోహన్ శర్మలు మాట్లాడుతూ పోటీల నియమనిబంధనలు తెలియజేశారు.
పద్యాన్ని స్పష్టంగా, రాగ యుక్తంగా పఠనం చేయడం పిల్లలు నేర్చుకోవాలన్నారు. తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం కార్యదర్శి, కోశాధికారి అనుముల దయాకర్ సమన్యయకర్తగా సేవలు అందించి పోటీల నిర్వహణను సజావుగా నడిపించారు. ఈ కార్యక్రమంలో పోటీదారులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
పోటీల్లో విజేతలు:
జూనియర్స్ విభాగం:
ప్రథమ బహుమతి: నౌండ్ల భువన్ చంద్ర,
ద్వితీయ బహుమతి: మారుపాక శశిధర్ పూర్వడ్,
తృతీయ బహుమతి: బీర్ల రోనీత్ గెలుచుకోగా బీర్ల వీక్ల, కొలుపుల యార్వి, బీర్ల ఆశిష్ రుద్రుల ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నారు.
సీనియర్స్ విభాగం:
ప్రథమ బహుమతి: వడ్లూరి పల్లవి, ద్వితీయ బహుమతి: వడ్లూరి అనుజ్ఞ, తృతీయ బహుమతి : లింగమూర్తి గెలుచుకున్నారు.