జైలుకు వెళ్లేందుకు తనకు భయం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్క కేసు కాదు.. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని తెలిపారు. తనను విచారణకు పిలవటం ఇది మూడోసారి అని వెల్లడించారు. మూడు సార్లు కాదు.. 30 సార్లయినా విచారణకు వస్తానని, అధికారులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు అని అభిప్రాయపడ్డారు. తనకు జైలు, కేసులు కొత్త కాదని, గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చానని కేటీఆర్ గుర్తుచేశారు.