- పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు
- అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు
- కెసిఆర్ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు
- శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన
- కేసీఆర్ పదేళ్ల పాలనపై ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పాలమూరు ప్రజలు ఆయన్ను అక్కున చేర్చుకుని ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ మోసపూరిత పాలన వల్లే పాలమూరు ప్రాంతం వెనుకబడింది. 98వ జీవోలో నిర్వాసితుల సమస్యను ఆయన పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయిన ప్రజలకు సాయం చేస్తానని చెప్పి మోసం చేశాడని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హావిూ ఇచ్చి, దానిని కూడా విస్మరించారని ఆరోపించారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ సరైన చర్యలు తీసుకోలేదని, 2019లో కాళేశ్వరం నిర్మించి 2023లో కూలిపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. జూరాల రిపేర్లను పట్టించుకోకపోవడాన్ని కూడా విమర్శించారు. పాలమూరులోని దళిత, ఆదివాసీ పిల్లల విద్య కోసం యంగ్ ఇండియా స్కూల్ను నిర్మిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి మా ప్రాధాన్యం అని సిఎం అన్నారు. కాంగ్రెస్ 14 సీట్లు గెలిచి ఉంటే మరిన్ని మంత్రిత్వ స్థానాలు వచ్చేవని చెప్పారు. కేసీఆర్ పాలనలో పాలమూరుకు అన్యాయం జరిగిందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు పచ్చబడేది, కానీ ఆయన 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పాలమూరు బిడ్డలు కేసీఆర్ను అక్కున చేర్చుకుని పార్లమెంట్కు పంపారు. సీఎం అయిన తర్వాత ఈ గడ్డకు ఆయన చేసిందేమిటి.. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎందుకు న్యాయం చేయలేదు. జీవో 98 ద్వారా ఇవ్వాల్సిన పరిహారం ఎందుకు ఇవ్వలేదు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి కేసీఆర్ ఎందుకు మాట తప్పారు. అలంపూర్, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఉన్న ఈ వర్గాలకు ఎందుకు న్యాయం చేయలేదు.
కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరు వస్తే అండగా నిలబడ్డాం. పదేళ్ల పాలనలో ఈ ప్రాంతానికి సున్నం పెట్టింది మీరు కాదా? ఇప్పుడు దుఃఖం వస్తోందని కేసీఆర్ అంటున్నారు. మాదిగల పిల్లలకు వైద్య విద్య సీట్లు వస్తుంటే దుఃఖం వస్తోందా? పాలమూరు బిడ్డ 20 ఏళ్లు సీఎంగా ఉండాలని ఈ జిల్లా కంకణం కట్టుకున్నందుకు దుఃఖమొచ్చిందా? పాలమూరు వాసులు చేపలు పట్టుకోవాలి.. చెప్పులు కుట్టుకోవాలా? విూ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పాలమూరు పచ్చగా మారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నావు? ఈ జిల్లా అంటే ఎందుకింత చిన్నచూపు? కేసీఆర్కి మద్దతిస్తున్న ఆ పార్టీ జిల్లా నేతలు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డికి సిగ్గుండాలి. భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, జూరాల ప్రాజెక్టుల పరిస్థితి ఏమైంది? ఒక్క కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. 2019లో కడితే.. 2023లో అది కూలింది. చిన్నగుడిసె వేసుకునేవాడు అయినా పదేళ్లు ఉండేట్టు నిర్మించుకుంటాడని అంటూ ఘాటు విమర్శలుచేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ఎన్ని వందలకోట్లు ఖర్చు అయినా.. ఈ ఏడాది డిసెంబర్ 9లోపు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరిస్తాం. రానున్న రెండేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తిచేయాలని నిర్ణయించాం అని రేవంత్రెడ్డి అన్నారు.