Tuesday, July 22, 2025
spot_img

వాన‌ల‌తో.. జ‌ర పైలం

Must Read
  • భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
  • ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
  • అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడండి
  • అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
  • యూరియా కొరత లేకున్నా కొందరు అసత్య ప్రచారాలు
  • 25 నుంచికొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి చర్యలు
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జూన్‌ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం నమోదు అయ్యిందని.. ఇది తక్కువ వర్షపాతమని సీఎం పేర్కొన్నారు. అయితే గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని.. అన్ని విభాగాలను అప్రమత్తం చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే 150 బృందాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే బృందాలను పంపిస్తున్నామని చెప్పారు. పోలీస్‌ కమిషనరేట్లల్లోని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలని వారికి వివరించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం సైతం అప్రమత్తంగా ఉండాలని హుకుం జారీ చేశారు. ఆ క్రమంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రతీరోజు జిల్లా కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందించాలని సీఎస్‌ రామకృష్ణారావును ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు.

భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని.. సాగునీటికి సంబంధించి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డిగ అభిప్రాయపడ్డారు. 2 కోట్ల 85 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. యూరియా స్టాక్‌కు సంబంధించి ప్రతీ ఎరువుల దుకాణం వద్ద స్టాక్‌ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. స్టాక్‌ డిటైల్స్‌ ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా స్టాక్‌ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోండంటూ ఆధికారులను ఆదేశించారు. రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా సీఎం రేవత్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96 లక్షల 95 వేల 299 రేషన్‌ కార్డులు ఉన్నాయన్నారు. గతంలో రేషన్‌ షాపులపై ఆసక్తి ఉండేది కాదని.. సన్న బియ్యంతో రేషన్‌ కార్డులకు డిమాండ్‌ పెరిగిందన్నారు. అంతేకాదు రేషన్‌ కార్డు విలువ, రేషన్‌ షాపు విలువ పెరిగిందన్నారు. జులై 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్‌ చేసుకోవాలని.. అలాగే ప్రతీ మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు పాల్గొనాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలన్నారు. వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్‌ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.కోటి కేటాయించాలి. రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర పక్రియ.. ఆందోళన అవసరం లేదని సీఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

Latest News

లిక్కర్‌ మాఫియా గుప్పిట్లో ప్రభుత్వం

కల్లు కాంపౌడ్‌లను ఎత్తేసే కుట్ర కులవృత్తులను అగౌరవపరుస్తున్న కాంగ్రెస్‌ మండిపడ్డ మాజీమంత్రి శ్రీనివాసగౌడ్‌ కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS