- కవిత దీక్ష, కాళేశ్వరం నివేదికపై నేతల సమాలోచన
- మరోవైపు కేబినెట్లో కాళేశ్వరం చర్చకు రంగం సిద్ధం
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది.. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన 72 గంటల నిరాహార దీక్ష, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్ నివేదిక ప్రధాన చర్చా అంశాలుగా నిలిచినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్న విధంగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అవినీతీ జరగలేదని, డిజైన్ లోపాలు లేవని, అన్ని నిర్మాణాలు వ్యాప్కో సంస్థ సూచనల మేరకే జరిగాయని నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డట్టు సమాచారం.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత అంశంపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. ప్రభుత్వానికి ఇటీవలే అందిన కమిషన్ నివేదిక నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యత లభించింది. కమిషన్ నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీభత్సమైన ఆరోపణలు నమోదైనట్లు అధికార వర్గాల సమాచారం.