హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు జమ చేసుకుంటున్న సీపీఎస్ సొమ్మును సైతం దిగమింగుతున్నది. ప్రతి నెల రూ.200 కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది.
13 నెలలుగా సాగుతున్న ఈ తతంగంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం గమనార్హం. ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేస్తాం. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను అమలు చేస్తాం’ ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల మంది ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
అక్కడితో ఆగలేదు. అంతకుమించిన అన్యాయాన్ని చేస్తూ వారి భవిష్యత్తును కూడా దెబ్బతీస్తున్నది. ఉద్యోగుల ప్రాథమిక హక్కు అయిన సీపీఎస్ సొమ్మును వారి ప్రాన్ అకౌంట్లో జమ చేయడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను జమచేయడం పక్కనపెడితే.. ఉద్యోగి నెలవారీ జీతం నుంచి రికవరీ చేసిన వాటాను కూడా జమచేయడంలేదు. ఇదేదో ఒక నెల, రెండు నెలలు కాదు, ఏకంగా 13 నెలల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నది. 2024 జనవరి నుంచి నవంబర్ 2024 వరకు 11 నెలలు, 2025 ఏప్రిల్, మే రెండు నెలలు కలిపి మొత్తంగా 13 నెలల వాటాను సర్కారు చెల్లించలేదు. దీంతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.