అరటిపండు, గుడ్డు సరఫరాకు కర్టాటక నిర్ణయం
పల్లీపట్టీలతో పిల్లల ఆరోగ్యానికి చేటు అన్న ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇకనుంచి పల్లీపట్టీల పంపిణీని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో వాటిలో అత్యధికంగా చక్కెర, హాని కలిగించే కొవ్వులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గడువు తీరిన, సరిగా నిల్వ చేయని పల్లీపట్టీలు కూడా ఉండటంతో పంపిణీని నిలిపివేస్తున్నామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ (పాఠశాల విద్య) పేర్కొన్నారు. మధ్యాహ్నభోజన పథకం కింద పాఠశాలల్లో పల్లీపట్టీలకు బదులుగా గుడ్డు లేదా అరటిపండు పంపిణీ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 2021 నుంచి మధ్యాహ్నభోజన సమయంలో గుడ్లు తినని పాఠశాల విద్యార్థుల కోసం కర్ణాటక ప్రభుత్వం అరటిపండ్లను లేదా వేరుశెనగ-బెల్లంతో చేసిన చిక్కీలను పంపిణీ చేస్తోంది. 2022 డిసెంబర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్కి పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అందించిన డేటా ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2.27 లక్షల మంది పిల్లలు మాత్రమే వీటిని ఎంచుకోగా దాదాపు 80శాతం విద్యార్థులు గుడ్లును ఎంచుకుంటున్నారు.