Sunday, May 25, 2025
spot_img

గ్రూప్ -1 పై అనేక సందేహాలు

Must Read
  • ప్రభుత్వ తీరు అక్షేపనీయం
  • పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి
  • సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

తెలంగాణ యువతకు అందులో ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయని విమర్శించారు. శుక్రవారంనాడు గ్రూప్ -1 పరీక్ష అంశాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ వ్రాశారు. ఈ సందర్భంగా గ్రూప్‌ – 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటే పారదర్శకంగా ఉద్యోగ నియామకాల పట్ల మీకు ఏ మేరకు చిత్తశుద్ది ఉందో తేటతెల్లమవుతుందని దుయ్యబట్టారు. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారి లోపించిందన్న విమర్శలు వస్తున్నాయన్నారు.

గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్‌ టికెట్‌ ఇష్యూ చేసిన టీజీపీఎస్సీ అధికారులు, మెయిన్స్‌ పరీక్షకు వేరే హాల్‌ టికెట్‌ జారీ చేశారని తెలిపారు. సాధారణంగా ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు అదే హాల్‌ టికెట్‌ నంబర్‌తో మెయిన్స్‌ పరీక్షలకు అప్పియర్‌ అయ్యే అవకాశం ఉంటుందని, కానీ ప్రిలిమినరీ పరీక్షల హాల్‌ టికెట్లు కాకుండా కొత్తగా జారీ చేసిన హాల్‌ టికెట్లతో మెయిన్స్‌ నిర్వహించడంపై మొదటి నుంచే అనేక సందహాలు నెలకొన్నాయన్నారు. వాటిని నివృత్తి చేయకుండానే మెయిన్స్‌ పరీక్షల తంతు ముగించారని విమర్శించారు. గ్రూప్‌-1 పరీక్షలపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు తాము తుది ఆదేశాలు ఇచ్చే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వొద్దని కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు. 563 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను 1 : 50 నిష్పత్తిలో ఎంపిక చేశామని టీజీపీఎస్సీ ప్రకటించిందని, వారిలో 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని పరీక్షల అనంతరం ప్రకటన చేసిందన్నారు.

కాని ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది, అంటే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యారని చెప్తున్న వారి సంఖ్య పదికి పెరిగిందని, ఈ పెరిగిన పది మంది ఎక్కడి నుంచి వచ్చారనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయన్నారు. అభ్యర్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు లేవనెత్తుతున్నారని చెప్పారు. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో పని చేస్తున్న నిపుణులైన ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్‌ చేయిస్తామని మొదట ప్రకటించిన టీజీపీఎస్సీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమనాలున్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్‌ పెంచి 46 కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిందన్నారు. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించిందని, అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని తెలంగాణ హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. ‘నీళ్లు – నిధులు – నియామకాలు’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని కోరారు. అభ్యర్థుల్లో నెలకొన్న అనేక సందేహాల నేపథ్యంలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS