- సిట్ దాడుల్లో హైదరాబాద్ శివారులో భారీగా డబ్బు పట్టివేత
- 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదు సీజ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యంకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంప్ను గుర్తించారు. లిక్కర్స్కామ్లో ఏ-40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెల్లడయ్యాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది.
నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది. రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తమ్ను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం స్కామ్లో రాజ్ కెసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి. అతడి నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వరుణ్పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. మరి కొన్ని చోట్ల సిట్ సోదాలు నిర్వహించే అవకాశముంది.
వైకాపా ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్దతలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశముందని సమాచారం. హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఎ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, ఎ12 చాణక్య రూ. 11 కోట్లని 12 అట్టపెట్టల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ గెస్ట్హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్రెడ్డి, పేరు విూద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు దూకుడు పెంచి హైదరాబాద్ నగరంలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. నగదు సీజ్ చేసి వరుణ్, చాణక్యలని అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.