- శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం
- సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు
- నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం
- కూలిన టన్నెల్ పైకప్పు… చిక్కుకుపోయిన 8 మంది
- ముమ్మరంగా సహాయక చర్యలు… అయినా కనిపించని పురోగతి
- ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు
- సొరంగంలోనికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనుల్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. టన్నెల్ లోని 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలిపోవడంతో 8 మంది చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉండగా… వారిని కాపాడేందుకు ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుంది. టన్నల్లోపల చిక్కుకున్న వారిని కాపాడటానికి ఉత్తరాఖాండ్ నుంచి నిపుణులు టీంను పిలిపించారు. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు. మరోవైపు ఎంతో కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నారు. రెస్క్యూ టీంతోపాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా టన్నల్ లోపలికి వెళ్లారు. టన్నెల్లో భారీగా బురద ఉండటం, శిథిలాలు ఉండటంతో రెస్క్యూ టీం అతి కష్టం మీద ముందుకు సాగుతుంది. సొరంగంలో మూడున్నర మీటర్ల మేరా బురద పేరుకుపోయి ఉంది.
సహాయక బృందాలు ట్యూబ్లు, థర్మకోల్ షీట్లు, వెదురు కర్రల సహాయంతో సొరంగంలోపలికి ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతుండటంతో బాధితుల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. టన్నెల్ లో ఉన్న నీటిని బయటకు పంపించేందుకు కనీసం 4 గంటల సమయం పడుతుందని మంత్రులకు సమాధానం ఇచ్చారు ఏజెన్సీ ప్రతినిధులు.
2025 ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా ఎనిమిది మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన ఉన్న సొరంగంలో కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సహాయక చర్యలపై నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిలో మనోజ్, శ్రీను, సందీప్,జట్కాస్, అనుసాహు, సంతోష్, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్ ఉన్నారు.