- కూర్చొని చర్చించి.. పరిష్కరించుకుందాం
- కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దాం
- తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టిన మాకు అభ్యంతరం లేదు
- రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే నా లక్ష్యం
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ.సీఎం చంద్రబాబు సూచన
గత కొన్ని రోజులుగా గోదావరి నదీ జలాల పై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల మద్య నీటి యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సమాయత్తం అవుతుండగా దీని పై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. తాజాగా బుధవారం నాడు ఈ ప్రాజెక్టు పై సీఎం.రేవంత్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు గురువారం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి బనకచర్ల పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు నిర్మాణం అపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలోనే సీఎం.రేవంత్రెడ్డి ఏపీ సర్కార్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తాజాగా రెండు రోజులుగా జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ సందర్భంగా అయన ఇరు గోదావరి నీటి విషయంలో ఇరు రాష్ట్రాలు గొడవ పడడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదని అన్నారు. ఈ విషయంలో ఇరు పక్షాలు కూర్చొని చర్చింకుని సమస్యకు పరిష్కార మార్గం అన్వేషిద్దామని సూచించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి సముద్రంలోకి కలిసిపోయే మిగులు జలాల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసే నీటి వాడకం విషయంలో సమస్యలు సృష్టించడం ఎంత వరకూ సమంజసమని రేవంత్ను ప్రశ్నించారు. ఇప్పటికే గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, ఆ మాటకొస్తే పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులేవీ అనుమతులు లేనివే అన్నారు. తాను తెలంగాణపై ఎప్పుడైనా గొడవపడ్డానా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో అసలే తక్కువగా ఉన్న నీటిపై గొడవలు పడితే లాభం లేదని రేవంత్కు స్పష్టం చేశారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దామని రేవంత్కు ఆఫర్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వారు ప్రాజెక్టులు కట్టుకుందామని కూడా ఆఫర్ చేశారు. అంతే కానీ ఎవరూ ఎవరిపై పోరాడాల్సిన అవసరం లేదన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డికి సూచించారు. అలాగే కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయని, కొత్త ట్రైబ్యునల్ ఎలా కేటాయిస్తూ అలా నీళ్లు తీసుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. మరోవైపు గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదని కూడా రేవంత్కు చంద్రబాబు గుర్తుచేశారు. కాబట్టి బనకచర్లకు అభ్యంతరాలు చెప్పొద్దని పరోక్షంగా ఆయన్ను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. ‘‘గోదావరి జలాలను మీరు వాడుకోండి.. ఇక్కడ కూడా వాడతారు’’ అని అన్నారు. తెలంగాణ వాడుకునే నీటిపై హామీ ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ‘‘వినియోగించే నీటిపై ఎవరు ఎవరికి రాసిస్తారు, నేను ఎవరినీ మభ్యపెట్టి మోసం చేయనని స్పష్టం చేశారు. నీటి కోసం తెలంగాణ నేతలు ఎవరూ పోరాటాలు చేయాల్సి అవసరం లేదని, మీరు కట్టే ప్రాజెక్టులన్నీ కట్టుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాను 40 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నానని, నేను ఎప్పుడూ ఎవరితోనూ గొడవలు, వివాదాలు పెట్టుకోలేదన్నారు. రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే నా లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి నీరు వినియోగించుకునేందుకు తెలంగాణ సైతం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.