- గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?
- నక్సలైట్లతో కలసి వందలాదిమంది బిజెపి వాళ్లను హతమార్చారు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay Kumar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తామంటూ ఆయనను అవమానించేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’పద్మ’ అవార్డుల కోసం జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని, గద్దర్కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్కు పద్మ అవార్డ్ ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న విమర్శలకు కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను, ఎన్ కౌంటర్లలో పోలీసులను పొట్టన బెట్టుకున్న వ్యక్తి గద్దర్ అని.. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మావోయిస్టుగా పని చేసి ఎంతో మంది ప్రాణాలు తీసిన వారిలో గద్దర్ ఒకరని.. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేదే లేదని కుండబద్దలు కొట్టారు. సోమవారం కరీంనగర్లో బండి సంజయ్ విూడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నక్సలైట్ కాదన్నారు. మావోయిస్టు భావజాలం వేరు.. నక్సలైట్గా పని చేయడం వేరని పేర్కొన్నారు. నక్సలిజంతో ఎంపీ ఈటల రాజేందర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అలాగే.. నంది అవార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలను కుంటున్న గద్దర్ అవార్డులు మా వాళ్ళు తీసుకోరని బండి సంజయ్ స్పష్టం చేశారు.